తెలుగు తేజం, యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. నితీష్ కుమార్ రెడ్డిలో అద్భుతమైన ప్రతిభ ఉందని కొనియాడాడు. టీమ్ కాంబినేషన్కు సరిగ్గా సరిపోతాడనే ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేశామన్నాడు.
నితీష్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకోవడం వల్ల చాలా ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్లో క్లీన్ స్వీప్కు గురైన టీమిండియా.. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.

నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్తో ఈ సిరీస్కు తెరలేవనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 4-0తో గెలవాలి. గత రెండు పర్యటనల్లో భారత్ విజయం సాధించింది. దాంతో తాజా పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆస్ట్రేలియాకు బయల్దేరే ముందు గౌతమ్ గంభీర్ సోమవారం మీడియాతో మాట్లాడాడు. న్యూజిలాండ్తో ఎదురైన ఘోరపరాజయంపై స్పందించాడు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు దూకుడుగా సమాధానం చెప్పాడు. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు ఇస్తామని హింట్ ఇచ్చాడు.
'మేం జట్టుగా ముందుగా సాగాలని అనుకుంటున్నాం. దేశం తరఫున ఆడేందుకు మేం అత్యుత్తమ జట్టును ఎంపిక చేశామని భావిస్తున్నాం. జట్టు కోసం ఆడే అత్యుత్తమ ఆటగాళ్లను తీసుకున్నాం. నితీష్ కుమార్ రెడ్డిలో అద్భుతమైన ప్రతిభ ఉంది. అతన్ని తుది జట్టులోకి వస్తే చాలా ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వస్తాయి. మేం ఏది అనుకుంటే దాన్ని అతను నెరవేరుస్తాడు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలతో పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్కు తలుపులు మూసుకుపోయాయనే విషయం స్పష్టమైంది. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసమే నితీష్ కుమార్ రెడ్డిని భారత్-ఏ తరఫున ఆసీస్ పర్యటనకు పంపించారు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు అనధికారిక టెస్ట్ల్లో నితీష్ కుమార్ రెడ్డి విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్ల్లో 1, 17, 16, 38 పరుగులే చేశాడు. బౌలింగ్లో రెండు వికెట్లే తీసాడు.
నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వస్తే టీమిండియాకు ఎక్స్ట్రా బౌలింగ్తో పాటు బ్యాటింగ్ ఆప్షన్ లభిస్తోంది. పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్లోనే నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కనుంది. ఆ మ్యాచ్తోనే అంతర్జాతీ టెస్ట్ల్లోకి అరంగేట్రం చేయనున్నాడు.