టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్లో రోహిత్ శర్మ అటు కెప్టెన్గా.. ఇటు బ్యాటర్గా దారుణంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్ల్లో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. దాంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు రోహిత్ శర్మపై విమర్శలు గుప్పిస్తున్నారు.
టీమిండియా టెస్ట్ సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పెర్త్ టెస్ట్లో అద్భుతమైన విజయాన్ని అందించిన జస్ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వాలని కోరుతున్నారు.

ఓటమి అంచున భారత్..
ఈ పింక్ బాల్ టెస్ట్లో టీమిండియా పేలవ ప్రదర్శనతో ఓటమి ముంగిట గెలిచింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 337 పరుగులు చేసి 157 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది.
భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 128 పరుగులు చేసింది. టీమిండియా టాప్-5 బ్యాటర్లు దారుణంగా విఫలమవ్వడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండు ఇన్నింగ్స్ల్లో భారత బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఓటమి ముంగిట నిలిచింది. ముఖ్యంగా రోహిత్ శర్మ వైఫల్యం తీవ్ర చర్చనీయాంశమైంది.
8 ఇన్నింగ్స్ల్లో 101 రన్స్..
వ్యక్తిగత కారణాలతో తొలి టెస్ట్కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్తో రీఎంట్రీ ఇచ్చాడు. తొలి టెస్ట్లో ఓపెనర్గా కేఎల్ రాహుల్ సత్తా చాటడంతో రోహిత్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 3 పరుగులు చేసిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్లో 6 పరుగులే చేసి వెనుదిరిగాడు.
సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్ట్ల సిరీస్లో 6 ఇన్నింగ్స్ల్లో 92 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్గా గత 8 టెస్ట్ ఇన్నింగ్స్ల్లో రోహిత్ శర్మ 101 పరుగులే చేశాడు. అంతేకాకుండా కెప్టెన్గా సొంతగడ్డపై వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓటమి ఎదుర్కొన్న రోహిత్ శర్మకు.. తాజా మ్యాచ్తో నాలుగో ఓటమి లోడ్ అవుతుంది.
జట్టులో నుంచి తీసేయండి ..
అంతేకాకుండా 2023 నుంచి రోహిత్ శర్మ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లకు ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటి వరకు రైట్ ఆర్మ్ పేసర్ల బౌలింగ్లో 13 సార్లు ఔటయ్యాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మపై వేటు వేసి బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.