ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. 340 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన టీమిండియా.. యశస్వి జైస్వాల్(208 బంతుల్లో 8 ఫోర్లతో 84) అసాధారణ బ్యాటింగ్తో డ్రా దిశగా సాగింది. కానీ ఒంటరి పోరాటం చేస్తున్న యశస్వి జైస్వాల్ను ప్యాట్ కమిన్స్.. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయంతో కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు.
ఈ నిర్ణయాన్ని యశస్వి జైస్వాల్ కూడా తప్పుబట్టాడు. తన నిరసనను ఫీల్డ్ అంపైర్లకు తెలియజేశాడు. ప్రస్తుతం ఈ వికెట్ విషయంలో థర్డ్ అంపైర్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియన్స్ ఛీటర్స్ అంటూ భారత అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అసలేం జరిగిందంటే..?
ప్యాట్ కమిన్స్ వేసిన 71 ఓవర్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని కమిన్స్ షాట్ పిచ్ బాల్గా వేయగా.. జైస్వాల్ థర్డ్ మ్యాన్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అంచనా వేయడంలో విఫలమైన యశస్వి జైస్వాల్ అడ్వాన్స్గా షాట్ ఆడాడు. దాంతో అతని గ్లోవ్స్ను తాకుతూ బంతి కీపర్ చేతిలో పడినట్లు కనిపించింది.
అయితే ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. వెంటనే కమిన్స్ రివ్యూ తీసుకోగా.. థర్డ్ అంపైర్ పలు యాంగిల్స్ రిప్లేలను పరిశీలించాడు. బంతి యశస్వి జైస్వాల్ గ్లోవ్ను తాకినట్లు స్పష్టమైన ఆధారం లేకున్నా.. ఔటిచ్చాడు. విజువల్స్ బంతి గ్లోవ్ను తాకినట్లు కనిపిస్తున్నా.. స్నీకో మీటర్లు మాత్రం ఎలాంటి స్పైక్ కనిపించలేదు. రూల్స్ ప్రకారం స్పష్టమైన ఆధారం లేనప్పుడు ఫీల్డ్ అంపైర్ల నిర్ణయానికి కట్టుబడాలి. కానీ ఇక్కడ థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్ల నిర్ణయానికి విరుద్దంగా ఔటిచ్చాడు. దాంతో యశస్వి జైస్వాల్ నిరాశగా పెవిలియన్ చేరాడు.
యశస్వి జైస్వాల్ ఔటవ్వడంతో ఈ మ్యాచ్పై ఆసీస్ ఫోకస్ పెట్టింది. ఓటమి నుంచి గట్టెక్కాలంటే టీమిండియా ఇంకా 18 ఓవర్లు ఆడాలి. క్రీజులో ఆకాశ్దీప్తో పాటు వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 474 పరుగుల భారీ స్కోర్ చేయగా.. భారత్ 369 పరుగులకు ఆలౌటైంది. 105 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 234 పరుగులకు ఆలౌటైంది.
Third Umpire giving the decision on Yashasvi Jaiswal. pic.twitter.com/HVYzaNkLlf
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 30, 2024