ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ టెస్ట్లో టీమిండియాకు ఎదురైన ఘోర పరాజయంపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. వ్యక్తి పూజ ఎక్కువైతే ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయని మండిపడుతున్నారు. ఫామ్లో లేని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెత్తిన పెట్టుకోవడంతోనే టీమిండియాకు ఘోర పరాజయం ఎదురైందని అభిప్రాయపడుతున్నారు.
టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టకుముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన గౌతమ్ గంభీర్ ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నాడని నిలదీస్తున్నారు. జట్టు కంటే ఎవరూ ఎక్కువ కారని పదే పదే చెప్పిన గంభీర్.. హెడ్ కోచ్గా ఆ పని ఎందుకు చేయలేకపోతున్నాడని మండిపడుతున్నారు.

రోహిత్ శర్మ గైర్హాజరీలో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. తొలి ఇన్నింగ్స్లో తక్కువ పరుగులకే ఆలౌటైనా.. బుమ్రా సంచలన బౌలింగ్.. అసాధారణ కెప్టెన్సీతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ ఆ జోరును సిరీస్ మొత్తం కొనసాగించలేకపోయింది.
విన్నింగ్ కాంబినేషన్ను కొనసాగించకుండా.. రోహిత్ శర్మ తిరిగి వచ్చాడని, అతని ఫామ్ను పట్టించుకోకుండా తుది జట్టులో ఆడించి టీమిండియా మేనేజ్మెంట్ ఘోర తప్పిదం చేసిందని మండిపడుతున్నారు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత వైఫల్యానికి ప్రధాన కారణం మేనేజ్మెంట్ అనాలోచిత నిర్ణయాలే కారణమని అభిప్రాయపడుతున్నారు.
మెల్ బోర్న్ టెస్ట్లో కేఎల్ రాహుల్ను ఓపెనర్గా కొనసాగించకపోవడం.. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై శుభ్మన్ గిల్ను పక్కనపెట్టడం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసిందని మండిపడుతున్నారు. ప్రత్యర్థి ఆటగాళ్లకు తగ్గట్లు వ్యూహాలు రచించడంలో టీమిండియా విఫలమైందని చెబుతున్నారు. మరోవైపు ఆసీస్ మాత్రం ప్రతీ బ్యాటర్కు తగ్గట్లు వ్యూహాలు రచించి ఫలితాలను రాబట్టిందని, భారత బ్యాటర్లను ఔట్ చేసిన విధానమే ఇందుకు నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు.
రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చినా జస్ప్రీత్ బుమ్రానే కెప్టెన్గా కొనసాగించాలని సిరీస్ ప్రారంభానికి ముందే దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టీమిండియా మేనేజ్మెంట్కు సూచించాడు. కానీ అతని సలహాను పట్టించుకోలేదు. బ్యాటింగ్ వైఫల్యంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న రోహిత్ శర్మ.. కెప్టెన్గా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు.
క్రికెట్ అనేది టీమ్ స్పోర్ట్స్ అని, ఒకరో ఇద్దరో ఆడితే విజయాలు దక్కవని, సమష్టిగా రాణించాల్సిందేనని గుర్తు చేస్తున్నారు. ఈ విషయం బాగా తెలిసిన గంభీర్ కూడా పాత పద్దతిలోనే నిర్ణయాలు తీసుకోవడం ఏంటని మండిపడుతున్నారు. వ్యక్తి పూజ ఎక్కువైతే టీమిండియాకు ఘోర పరాజయాలే ఎదురవుతాయని విమర్శించిన గంభీర్.. హెడ్ కోచ్గా తాను చేస్తున్న పని ఏంటో ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.