
అహ్మదాబాద్: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి పరాజయాన్ని చవి చూసిన టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమవుతోంది. అహ్మదాబాద్ వేదికగా గురువారం(మార్చి9) నుంచి ప్రారంభంకానున్న ఈ చివరి టెస్ట్కు ఇరు దేశాల ప్రధానులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. భారత ప్రధాన నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. అయితే ఇరుదేశాల ప్రధానుల రాకతో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(జీసీఏ) అభిమానులకు ఊహించని షాకిచ్చింది.
ప్రధానుల రాక నేపథ్యంలో తొలి రోజుకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్ లో బ్లాక్ చేసింది. భద్రతా సమస్యలు తలెత్తకుండా తొలి రోజు ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్(జీసీఏ) తొలి రోజుకు సంబంధించిన టికెట్లను బ్లాక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై జీసీఏ ఇప్పటి వరకు అధికారిక ప్రకట చేయలేదు. బుక్మై షో మాత్రం తొలి రోజుకు సంబంధించిన టికెట్లు మా వెబ్సైట్లో అందుబాటులో లేవని స్పష్టం చేసింది.
తొలి రోజు టికెట్లు బ్లాక్ చేయడంతో అనేక ఊహగానాలు వెలువడుతున్నాయి. స్కూల్ పిల్లలను అనుమతిస్తారని ఓ వైపు ప్రచారం జరుగుతుండగా.. మోదీ అనుచరులు, బీజీపీ కార్యకర్తల కోసం టికెట్లు బ్లాక్ చేశారని మరో వాదన వినిపిస్తోంది. అయినా ప్రధానులు రోజంతా మ్యాచ్ చూస్తారా? అని కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మహా అయితే ఓ గంట పాటు మైదానంలో గడిపినా ఆ తర్వాత అయితే వెళ్లిపోతారు కదా? అని జీసీఏను అడుగుతున్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియమైన అహ్మదాబాద్లో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ ఆడటం ఆటగాళ్లకు కూడా కష్టంగా ఉంటుందని, తొలి రోజు టికెట్లను ఆన్లైన్లో పెట్టాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ సిరీస్లో ఏ మ్యాచ్ కూడా మూడు రోజులకు మించి జరగలేదని, అసలు కథ అంతా తొలి రోజే ఉంటుందంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ వ్యవహారంపై జీసీఏ మౌనం పాటిస్తోంది.