టెస్ట్ క్రికెట్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అయిన టీమిండియా.. ఆస్ట్రేలియా పర్యటనలో 1-3తో ఘోర పరాజయం చవిచూసింది. 10 ఏళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసీస్కు కోల్పోయింది. ఈ సిరీస్లో భారత బ్యాటర్ల వైఫల్యం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది.
ముఖ్యంగా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యారు. రోహిత్ శర్మ 5 ఇన్నింగ్స్ల్లో 31 పరుగులు చేస్తే.. విరాట్ కోహ్లీ 9 ఇన్నింగ్స్ల్లో 190 పరుగులే చేశాడు. విరాట్ కోహ్లీ 8 సార్లు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్కే వెనుదిరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఇద్దరు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ కూడా వ్యక్తమవుతోంది.

కోహ్లీ.. చరిత్ర సృష్టించాడు
అయితే విరాట్ కోహ్లీని విమర్శిస్తున్న వారంత గతంలో అతను సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలని అతని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం పేలవ ప్రదర్శన కనబరుస్తున్న కోహ్లీనే 6 ఏళ్ల క్రితం ఆసీస్ గడ్డపై చారిత్రాత్మక విజయాన్ని అందించాడని విమర్శకులకు చురకలంటిస్తున్నారు.
సరిగ్గా 6 ఏళ్ల క్రితం ఇదే రోజు(2019లో జనవరి 7) విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఆసీస్ గడ్డపై 2-1 తేడాతో టెస్ట్ సిరీస్ గెలిచి సరికొత్త చరిత్రను లిఖించింది.
71 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. 1947 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్న టీమిండియా 2018-19 పర్యటన వరకు ఒక్కసారి కూడా సిరీస్ గెలవలేదు. కానీ కోహ్లీ అసాధారణ కెప్టెన్సీతో పాటు చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్ సూపర్ బ్యాటింగ్.. బుమ్రా, షమీ, ఇషాంత్ శర్మ సెన్సేషనల్ బౌలింగ్తో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది.
VIRAT KOHLI AND HIS BOYS CREATED HISTORY ON THIS DAY 6 YEARS AGO...!!! 🇮🇳
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 7, 2025
- India became the first ever Asian team to win a Test series in Australia. Pujara, Pant and Kohli with the bat, Bumrah, Shami and Ishant with the ball. 🏆 pic.twitter.com/t38iQAnp88
ధోనీ వల్లే కోహ్లీ ఇలా...
ఈ విజయాన్ని గుర్తు చేసుకుంటూ అభిమానులు కోహ్లీ కెప్టెన్సీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ధోనీ కారణంగానే కోహ్లీ స్వార్థపరుడిగా మారాడని, అతని ప్రభావంతోనే టెస్ట్ కెప్టెన్సీ వదిలేసాడని అభిప్రాయపడుతున్నారు. 'కింగ్ విరాట్ కోహ్లీ', 'కింగ్ కోహ్లీ నుంచి ఎవరూ ఈ ఘనతను లాక్కోలేరు'అని కామెంట్ చేస్తున్నారు.
టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీని విరాట్ వదిలేయడం కోహ్లీ తీసుకున్న చెత్త నిర్ణయమని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్లు ఎప్పుడైనా సరిగ్గా రాణించకపోతే.. వారిని విమర్శించడం.. రిటైర్మెంట్ తీసుకోవడం సరికాదని ఇతర అభిమానులకు సూచిస్తున్నారు. టెస్ట్ కెప్టెన్గా విరాట్ కోహ్లీ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడని గుర్తు చేస్తున్నారు.

చెలరేగిన పుజారా, కోహ్లీ..
చతేశ్వర్ పుజారా, బుమ్రా, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. అడిలైడ్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత జట్టు 31 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన 250 పరుగులు చేయగా పుజారా(123) సెంచరీ బాదాడు. అనంతరం రెండో టెస్ట్లో ఆస్ట్రేలియా గెలుపొందడంతో సిరిస్ 1-1తో సమం అయింది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా 137 పరుగులతో విజయం సాధించింది.
సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో వరుణుడు అంతరాయం కలిగించడంతో డ్రాగా ముగిసింది. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ను కోహ్లీసేన 2-1 తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ సిరిస్లో పుజారా 521 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇందులో మూడు శతకాలు ఉన్నాయి. బుమ్రా 21 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఇందులో ఒక ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది.