ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్ట్లో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. అతను ఔటైన విధానంపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగుతోంది. థర్డ్ అంపైర్ ఘోర తప్పిదంతోనే టీమిండియా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పలువురు భారత మాజీ క్రికెటర్లు సైతం థర్డ్ అంపైర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముమ్మాటికి థర్డ్ అంపైర్ తప్పిదమేనని అభిప్రాయపడ్డారు.

అసలేం జరిగిందంటే..?
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసింది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు దూరంగా ఉండటంతో రాహుల్ ఓపెనర్గా బరిలోకి దిగాడు. పిచ్ నుంచి లభించిన సహకారంతో ఆసీస్ బౌలర్లు చెలరేగడంతో భారత్ ఆదిలోనే వికెట్లు కోల్పోయింది. ఓ వైపు వికెట్లు పడ్డా మరోవైపు రాహుల్ తన జిడ్డు బ్యాటింగ్తో క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేశాడు.
74 బంతులాడి మూడు ఫోర్లతో 26 పరుగులతో క్రీజులో సెట్ అయ్యాడు. బంతిని అద్భుతంగా డిఫెన్స్ చేస్తూ ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. అయితే మిచెల్ స్టార్క్ వేసిన 23వ ఓవర్ రెండో బంతిని రాహుల్ ఆఫ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అంచనా వేయడంతో రాహుల్ విఫలమయ్యాడు.
క్లారిటీ లేకున్నా..
దాంతో బ్యాట్ను మిస్సైన బంతి కీపర్ చేతిలో పడగా.. ఆసీస్ ఆటగాళ్లు గట్టిగా అరించారు. ఫీల్డ్ అంపైర్ నాటౌటివ్వగా.. ఆసీస్ రివ్యూ తీసుకుంది. రిప్లేలో బంతి బ్యాట్కు తాకినట్లు స్పష్టత లేదు. అదే సమయంలో బ్యాట్.. ప్యాడ్ను తాకడంతో అల్ట్రా ఎడ్జ్లో స్పైక్స్ వచ్చాయి.
దాంతో ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఈ నిర్ణయంపై కేఎల్ రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. అయితే క్లారిటీ లేనప్పుడు ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడాల్సిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా థర్డ్ అంపైర్ది తెలివి తక్కువ నిర్ణయమని ట్వీట్ చేశాడు.
తెలివి తక్కువ నిర్ణయం..
'ఫ్రంట్ ఆన్ యాంగిల్ అందుబాటులో లేదు. ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయం నాటౌట్. ఈ నిర్ణయం సరైనది కాదని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు లేవు. బ్యాట్.. ప్యాడ్ను తాకినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో స్పైక్స్ కనిపించాయి. థర్డ్ అంపైర్ తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నాడు.'అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
'మిలియన్ కెమెరాలు అందుబాటులో ఉన్నా.. కేఎల్ రాహుల్ ఔటా? కాదా? అని తెలుసుకునేందుకు అవి అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది'అని మురళీ కార్తీక్ ట్వీట్ చేశాడు. సరైన యాంగిల్ లేనప్పుడు స్పష్టత కోసం మరో యాంగిల్ ఇవ్వమనాల్సిందని, సాంకేతికతను సరిగ్గా వినియోగించుకోవడం లేదని, సరైన ప్రోటోకాల్ అనుసరించట్లేదని వసీం జాఫర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.