
న్యూఢిల్లీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్లో టీమిండియా వ్యూహాత్మక తప్పిదాలు చేసి ఓటమిపాలైందని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అన్నాడు. అతిగా టర్న్ అయిన ఇండోర్ వికెట్పై టీమిండియా ఓ జెన్యూన్ బౌలర్ను మిస్సయ్యిందన్నాడు. మహమ్మద్ సిరాజ్కు బదులు కుల్దీప్ యాదవ్తో బరిలోకి దిగి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. శుక్రవారం ముగిసిన ఈ మ్యాచ్లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. పేలవ బ్యాటింగ్తో టీమిండియా మూల్యం చెల్లించుకుంది. ఈ పరాజయంపై స్పందించిన డానిష్ కనేరియా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'టీమిండియా ఓ జెన్యూన్ బౌలర్ను మిస్సయ్యింది. కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అతన్ని తుది జట్టులోకి తీసుకోవాల్సి ఉంది. ఇండోర్ టెస్ట్లో టీమిండియా ఒక్క పేసర్తోనే బరిలోకి దిగాల్సింది. ఉమేశ్ యాదవ్ కొత్తగా జట్టులోకి వచ్చిన నేపథ్యంలో మహమ్మద్ సిరాజ్ను పక్కనపెట్టాల్సింది. ఇక్కడే టీమిండియా ఘోర తప్పిదం చేసింది.'అని కనేరియా చెప్పుకొచ్చాడు.
ఈ సిరీస్లో సిరాజ్ ఒకే ఒక్క వికెట్ తీసాడు. గత రెండు మ్యాచ్ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. స్పిన్ వికెట్పై సిరాజ్ అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. మరోవైపు కుల్దీప్ యాదవ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. బంగ్లాదేశ్ పర్యటనలో అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. 8 వికెట్లతో కీలకమైన 40 పరుగులు చేశాడు. కానీ మరుసటి టెస్ట్లోనే అతన్ని పక్కనపెట్టారు.
76 పరుగుల లక్ష్యంతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 18.5 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 78 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(0) సిల్వర్ డక్గా వెనుదిరిగినా.. ట్రావిస్ హెడ్(53 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 49 నాటౌట్), మార్నస్ లబుషేన్(58 బంతుల్లో 6 ఫోర్లతో 28) అటాకింగ్ గేమ్తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ ఒక్కడే ఒక వికెట్ తీసాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన టీమిండియా 109 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 197 పరుగులు చేసి 88 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్లోనూ విఫలమైన భారత్ 163 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ మాథ్యూ కుహ్నేమన్ ఐదు వికెట్లతో భారత్ను దెబ్బతీస్తే.. రెండో ఇన్నింగ్స్లో నాథన్ లయర్ 8 వికెట్లతో పతనాన్ని శాసించాడు.