టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమవడంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఒకప్పుడు తన ఆటతో క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన కోహ్లీ ఇప్పుడు.. పేలవ ఫామ్తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.గతంలో కోహ్లీ కోసమే మ్యాచ్ చూసిన అభిమానులు..ఇప్పుడు అతను లేకుంటేనే బాగుంటుందంటున్నారు.
సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్ట్ల సిరీస్లో స్పిన్ బౌలింగ్ ఆడలేక వికెట్ పారేసుకున్న కోహ్లీ.. ఆసీస్ పర్యటనలో ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలకు వెనుదిరిగాడు. 9 ఇన్నింగ్స్ల్లో ఓ సెంచరీతో సాయంతో 190 పరుగులు చేసిన కోహ్లీ.. 8 సార్లు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్కే ఔటయ్యాడు. కోహ్లీ క్రీజులోకి రాగానే ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్తో ఆసీస్ బౌలర్లు దాడికి దిగారు. కోహ్లీ సహనాన్ని పరీక్షించి అతన్ని బుట్టలో వేసుకున్నారు.

అయితే కోహ్లీ వైఫల్యానికి ప్రధాన కారణం కొత్త బంతి. కొత్త బంతితో ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్లో వేసినప్పుడే కోహ్లీ ఔటయ్యాడు. పాత బంతితో ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్లో వేసిన అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్ల వైఫల్యం కోహ్లీ కొంపముంచింది. కేఎల్ రాహుల్-యశస్వి జైస్వాల్ త్వరగా ఔటవ్వడంతో కోహ్లీ కొత్త బంతిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యూబాల్తో స్వింగ్ రాబట్టిన ఆసీస్ బౌలర్లు.. ఊరించే బంతులతో కోహ్లీని బుట్టలో వేసుకున్నారు.
పెర్త్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్లు కేఎల్ రాహుల్-యశస్వి జైస్వాల్ అద్భుతంగా ఆడారు. బంతి పాతబడే వరకు క్రీజులో ఉండి భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి సెంచరీ కొట్టాడు. కానీ రెండో టెస్ట్ నుంచి ఆఖరి టెస్ట్ వరకు ఓపెనర్లు, ఫస్ట్ డౌన్ బ్యాటర్ విఫలమవడంతో కోహ్లీ కొత్త బంతిని ఎదుర్కోవాల్సి వచ్చింది.
దాంతో ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ను కవర్ డ్రైవ్ కొట్టాలనే ఉద్దేశంతో వికెట్ పారేసుకున్నాడు. కొత్త బంతిని ఎదుర్కోవడం కోహ్లీకి సమస్యగా మారింది. అంతర్జాతీయ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన కోహ్లీ.. తన షాట్లను అప్డేట్ చేసుకోలేకపోయాడు. స్వీప్, రివర్స్ స్వీప్, ర్యాంప్ షాట్స్ ఆడలేక వికెట్లు పారేసుకుంటున్నాడు. తన ట్రేడ్ మార్క్ షాట్ అయిన కవర్ డ్రైవ్ ఆడబోయి మూల్యం చెల్లించుకుంటున్నాడు. ఇప్పటికైనా కోహ్లీ తన షాట్స్ను మార్చుకొని అప్డేట్ కావాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.
కోహ్లీ కొత్త బంతితో ఇబ్బంది పడుతున్నాడనే విషయాన్ని చతేశ్వర్ పుజారా రెండో టెస్ట్ అనంతరమే చెప్పాడు. 'ఓపెనర్ల వైఫల్యం వల్ల కోహ్లీకి కొత్త బంతిని ఆడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొత్త బంతిని ఆడినప్పుడల్లా విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. పెర్త్లో పాత బంతిని ఎదుర్కొన్నప్పుడు సెంచరీ చేశాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ కంటే కొత్త బంతి కోహ్లీకి బలహీనతగా మారింది.'అని రెండో టెస్ట్ అనంతరమే పుజారా చెప్పాడు. కానీ టీమిండియా మేనేజ్మెంట్ ఈ విషయాన్ని గ్రహించలేకపోయింది.