ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్లో భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లు మెరుగ్గా బౌలింగ్ చేయలేదని వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా అన్నాడు. తొలి 6 ఓవర్లలో ఆసీస్ బ్యాటర్లను ఈ ఇద్దరూ పేసర్లు ఇబ్బంది పెట్టలేకపోయారని విమర్శించాడు. ఈ ఇద్దరి కంటే యువ పేసర్ ఆకాశ్ దీప్ మెరుగ్గా బౌలింగ్ చేశాడని కొనియాడాడు.
బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియం వేదికగా శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో తొలి రోజు 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(19 బ్యాటింగ్), నాథన్ మెక్స్వీనీ(4 బ్యాటింగ్) ఆచితూచి ఆడారు.

ఈ 13.2 ఓవర్లను సిరాజ్, బుమ్రా, ఆకాశ్దీప్లే వేసారు. ఓవర్కాస్ట్ కండిషన్స్తో పాటు పిచ్పై గ్రాస్ ఉండటంతో వికెట్ బౌలింగ్కు అనుకూలంగా ఉంటుందని టీమిండియా బౌలర్లు భావించారు. కానీ బుమ్రా, సిరాజ్ బంతులు ఏమాత్రం స్వింగ్ కాలేదు. బంతి స్వింగ్ అవ్వడం లేదని బుమ్రా చెప్పిన మాటలు స్టంప్ మైక్లో రికార్డ్ అయ్యాయి.
అయితే బుమ్రా సిరాజ్లు సరైన లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేయలేదని ఈ మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరిస్తున్న పుజారా అన్నాడు. బుమ్రా, సిరాజ్లు.. ఆకాశ్ దీప్ను చూసి నేర్చుకోవాలని సూచించాడు. ఆకాశ్ దీప్ సరైన లెంగ్త్లో బౌలింగ్ చేసి ఆసీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడని చెప్పాడు. బుమ్రా. సిరాజ్లు మాత్రం ఎక్స్ట్రా ఫుల్ లెంగ్త్, షార్ట్ లెంగ్త్, లెగ్ స్టంప్ లైన్లో బౌలింగ్ చేశారని తెలిపాడు. ఆసీస్ పిచ్లపై 6 మీటర్ల పొడవున బౌలింగ్ చేయడం సరికాదన్నాడు. పెర్త్ టెస్ట్లో బుమ్రా, సిరాజ్ సరైన లెంగ్త్లో బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టారని గుర్తు చేశాడు.
తొలి 6 ఓవర్లలో విఫలమైనా.. తర్వాత లయను అందుకున్నారని పుజారా చెప్పుకొచ్చాడు. ఉస్మాన్ ఖవాజా, మెక్స్వీని భారత బౌలర్ల వైఫల్యాన్ని అందిపుచ్చుకొని క్రీజులో నిలబడ్డారని తెలిపాడు. రెండో రోజు అయిన భారత పేసర్లు సరైన లెంగ్త్లో బౌలింగ్ చేయాలని సూచించాడు.