ఆస్ట్రేలియా పర్యటనకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ పర్యటనలోని ఓ మ్యాచ్కు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం టీమిండియా నవంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సిరీస్లో తొలి టెస్ట్ లేదా రెండో టెస్ట్కు రోహిత్ శర్మ దూరమవుతాడని ఓ వార్తా సంస్థ తెలిపింది. ఇప్పటికే ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి రోహిత్ శర్మ తెలియజేశాడని, వ్యక్తిగత పనుల వల్ల తొలి రెండు టెస్ట్ల్లో ఒక మ్యాచ్ ఆడలేనని చెప్పాడని సదరు సంస్థ పేర్కొంది.

ఒక మ్యాచ్కు దూరం..
'ప్రస్తుతానికి రోహిత్ శర్మ గైర్హాజరీ గురించి స్పష్టమైన సమాచారం లేదు. వక్తిగత పనులు, అతని ఉన్న సమస్య గురించి రోహిత్ శర్మ బీసీసీఐకి సమాచారమిచ్చాడు. తొలి రెండు టెస్ట్ల్లో ఒక మ్యాచ్కు అతను గైర్హాజరీ కానున్నాడు. అయితే ఆ వ్యక్తిగత సమస్య సిరీస్ ప్రారంభానికి ముందే పరిష్కారమైతే రోహిత్ జట్టుకు అందుబాటులో ఉంటాడు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.'అని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించినట్లు సదరు సంస్థ తమ కథనంలో రాసుకొచ్చింది.
రోహిత్ దూరమైతే.. కెప్టెన్ ఎవరు..?
ఒకవేళ రోహిత్ శర్మ దూరమైతే.. అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారు? జట్టును ఎవరు నడిపిస్తారు? అనేది చర్చనీయాంశమైంది. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన అభిమన్యు ఈశ్వరన్.. ఈ పర్యటనకు బ్యాకప్ ఓపెనర్గా ఎంపికవ్వనున్నాడు. ఒకవేళ రోహిత్ దూరమైతే.. అతనే ఓపెనర్గా బరిలోకి దిగుతాడు.
అయితే అతనికి శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్లతో పోటీ ఉండనుంది. గతంలో ఈ ఇద్దరూ ఓపెనర్లుగా ఆడారు. జట్టును నడిపించేది ఎవరా? అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు వైస్ కెప్టెన్ ఎవరా? అనేది ప్రకటించలేదు. ద్రవిడ్ హెడ్ కోచ్గా ఉన్న సమయంలో జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. కానీ నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. బుమ్రాకు వైస్ కెప్టెన్సీ ఇస్తాడా? లేదా? అనేది చూడాలి.
నవంబర్ 22 నుంచి షురూ..
ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా జరగనుండగా.. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. రెండో టెస్ట్ డే/నైట్ పింక్బాల్తో జరగనుంది. ఈ రెండు మ్యాచ్ల్లో ఒక్క టెస్ట్కు రోహిత్ దూరం కానున్నాడు. చివరి మూడు టెస్ట్లు మాత్రం డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా.. డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్, జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది.