ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మధ్యలో టీమిండియా తాత్కలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మైదానం వీడాడు. రెండో రోజు ఆటలొ 8 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన బుమ్రా ఓ వికెట్ కూడా తీసాడు.
ఆ తర్వాత మైదానం వీడిన అతను ప్రాక్టీస్ జెర్సీలో టీమిండియా మేనేజర్తో కలిసి కారులో బయటకు వెళ్లిపోయాడు. బుమ్రా కారులో బయటకు వెళ్తున్న విజువల్స్ను అధికారిక బ్రాడ్ కాస్టర్ అభిమానులకు చూపించింది. స్కానింగ్ కోసమే బుమ్రా బయటకు వెళ్లినట్లు అర్థమవుతోంది. ఒకవేళ గాయం ఉన్నట్లు తేలితే మాత్రం అతను ఈ మ్యాచ్ మొత్తానికి దూరం కానున్నాడు.

అయితే అతనికి ఎక్కడ గాయమైందనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఈ సిరీస్లో బుమ్రా ఇప్పటికే 32 వికెట్లు పడగొట్టాడు. చాలా ఓవర్లు బౌలింగ్ చేశాడు. దాంతో అతనిపై తీవ్ర ఒత్తిడి పడినట్లు అర్థమవుతోంది. వెన్ను నొప్పి మళ్లీ తిరగబెట్టిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బుమ్రా గాయానికి సంబంధించి బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. బుమ్రా గైర్హాజరీలో విరాట్ కోహ్లీ.. టీమిండియాను నడిపిస్తున్నాడు.
ఈ మ్యాచ్లో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. 9/1 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 181 పరుగులకు ఆలౌటైంది. బ్యూ వెబ్స్టర్(105 బంతుల్లో 5 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. స్టీవ్ స్మిత్(57 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 33) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/51), ప్రసిధ్ కృష్ణ(3/42) మూడేసి వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా(2/33), నితీష్ కుమార్ రెడ్డి(2/32) రెండేసి వికెట్లు పడగొట్టారు. బుమ్రా మధ్యలోనే వెనుదిరిగినా.. సిరాజ్, ప్రసిధ్ అద్భుత ప్రదర్శన కనబర్చారు.
భారత్ తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులు చేసిన విషయం తెలిసిందే. రిషభ్ పంత్(40), రవీంద్ర జడేజా(26) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్(4/31) నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్(3/49) మూడు వికెట్లు పడగొట్టాడు. ప్యాట్ కమిన్స్(2/37) రెండు వికెట్లు తీసాడు. నాథన్ లయన్కు ఓ వికెట్ దక్కింది.
Jasprit Bumrah has left the SCG: https://t.co/0nmjl6Qp2a pic.twitter.com/oQaygWRMyc
— cricket.com.au (@cricketcomau) January 4, 2025