సొంతగడ్డపై భారత్తో జరుగుతున్న ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, మ్యాచ్ విన్నర్ ట్రావిస్ హెడ్ మెల్ బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న బాక్సింగ్ డే టెస్ట్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి.
గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్లో ట్రావిస్ హెడ్కు తొడ కండరాలు పట్టేసాయి. ఈ సమస్య నుంచి అతను పూర్తిగా కోలేకోలేదని తెలుస్తోంది. దాంతో అతను మెల్ బోర్న్ టెస్ట్కు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

గాయం నిజమే..
ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్ డోనాల్డ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ట్రావిస్ హెడ్ తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పాడు. అయితే అతను ఫిట్నెస్ టెస్ట్ పాసై తుది జట్టులోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ట్రావిస్ హెడ్ గాయం నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఇద్దరు వైస్ కెప్టెన్లను ఎంపిక చేసిందన్నాడు.
చివరి రెండు టెస్ట్లకు ట్రావిస్ హెడ్తో పాటు స్టీవ్ స్మిత్.. ప్యాట్ కమిన్స్కు డిప్యూటీగా వ్యవహరిస్తారని తెలిపాడు. నాలుగో టెస్ట్కు ట్రావిస్ హెడ్ అందుబాటులో ఉండటంపై సందేహాలు ఉండటంతో క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్ను వైస్ కెప్టెన్గా నియమించిందనే విషయం అర్థమవుతోంది.
గబ్బాలో గాయం..
గబ్బా టెస్ట్ చివరి రోజు ఆటలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ట్రావిస్ హెడ్ తొడ కండరాలు పట్టేసాయి. నాన్స్ట్రైకర్ వైపు పరుగెత్తేటప్పుడు అతను కుంటుతూ కనిపించాడు. ట్రావిస్ హెడ్కు తొడ కండరాలు పట్టేసాయని ఆ మ్యాచ్ అనంతరం ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా తెలిపాడు. నాలుగో టెస్ట్కు చాలా సమయం ఉందని, ఆలోపు ఫిట్ అవుతాడని చెప్పాడు.
టీమిండియాకు పండుగే..
ఒకవేళ బాక్సింగ్ డే టెస్ట్కు ట్రావిస్ హెడ్ దూరమైతే.. భారత్కు కలిసొచ్చే అంశమే. ఈ మ్యాచ్ను సునాయసంగా గెలవవచ్చు. గత మూడు టెస్ట్ల్లో ఆసీస్ తరఫున ట్రావిస్ హెడ్ ఒక్కడే రాణించాడు. తొలి టెస్ట్లో 11, 89 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. పింక్ బాల్ టెస్ట్లో విధ్వంసకర శతకం(140) భారత్ పతనాన్ని శాసించాడు. వర్షం అంతరాయం కలిగించిన మూడో టెస్ట్లోనూ భారీ శతకంతో (152) భారత్పై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. వర్షంతో పాటు టెయిలెండర్ల అసాధారణ ప్రదర్శనతో ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కింది.
మిగతా బ్యాటర్లందర్నీ కట్టడి చేస్తున్న భారత్.. ట్రావిస్ హెడ్ను మాత్రం అడ్డుకోలేకపోతుంది. అతను భారత్కు హెడెక్గా మారాడు. ఈ క్రమంలోనే అతను నాలుగో టెస్ట్కు అతను దూరమైతే టీమిండియాకు ఈజీ అవుతుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.