
నాగ్పూర్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దుమ్మురేపాడు. మొకాలి గాయంతో 5 నెలల పాటు ఆటకు దూరమైన జడేజా.. తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఫస్ట్ మ్యాచ్లోనే (5/47)ఐదు వికెట్ల ఘనతను అందుకొని పర్యాటక టీమ్ పతనాన్ని శాసించాడు. దాంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 177 పరుగులకే కుప్పకూలింది. అయితే ఆసీస్ పతనాన్ని తట్టుకోలేకపోతున్న ఆ దేశ మీడియా.. సరికొత్త డ్రామాకు తెరలేపింది. ఐదు వికెట్లు తీసిన జడేజా బౌలింగ్పై సందేహం వ్యక్తం చేస్తూ ఓ కథనాన్ని వండి వార్చింది.
మ్యాచ్ సందర్భంగా రవీంద్ర జడేజా తన చేతికి ఏమో పూసుకున్నాడని ఆ కథనంలో పేర్కొంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 45 ఓవర్లు ముగిసేసరికి 120/5 స్కోరుతో ఉంది. అప్పటికే జడేజా మూడు వికెట్లు పడగొట్టి జోరు మీదున్నాడు. ఈ క్రమంలో 46వ ఓవర్ను జడేజా వేశాడు. ఈ ఓవర్ ప్రారంభానికి ముందు జడ్డూ బంతిని అందుకుని సిరాజ్ దగ్గరికి వెళ్లాడు. అతని దగ్గరి ఏదో పదార్థాన్ని తీసుకుని బంతిని స్పిన్ చేసే వేలికి రాసుకున్నాడు. అనంతరం కెప్టెన్ రోహిత్తో కలిసి ఫీల్డింగ్ సెట్ గురించి మాట్లాడి బౌలింగ్ని కొనసాగించాడు.
అయితే ఈ విషపు ప్రచారాన్ని భారత స్పోర్ట్స్ జర్నలిస్టులు, విశ్లేషకులు తిప్పికొడుతున్నారు. తన వేళ్లు నొప్పిగా ఉండటంతో ఆయింట్మెంట్ రాసుకున్నాడని, దీన్ని భూతద్దంలో పెట్టి విషపు ప్రచారాన్ని చేస్తున్నారని మండిపడుతున్నారు. నేషనల్ మీడియా ఆజ్ తక్ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఆసీస్ మీడియా తీరును తప్పుబట్టింది.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(69 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 56 బ్యాటింగ్) హాఫ్ సెంచరీతో రాణించాడు.