ఆస్ట్రేలియా మహిళలతో సొంతగడ్డపై జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో టీమిండియా పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిన హర్మన్ప్రీత్ సేన.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 0-2తో సిరీస్ కోల్పోయింది. శనివారం జరిగిన రెండో వన్డేలో చెత్త ఫీల్డింగ్.. పేలవ బ్యాటింగ్తో 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ను చేజేతులా టీమిండియా చేజార్చుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 258 పరుగులు చేసింది. ఫొబే లిట్చిఫీల్డ్(98 బంతుల్లో 6 ఫోర్లతో 63), ఎల్లిస్ పెర్రీ(47 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు.

ఈ మ్యాచ్లో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్లు నేలపాలు చేశారు. దాంతో ఆసీస్.. భారత్ ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో పూజ వస్త్రాకర్, శ్రేయాంక పాటి, స్నేహ్ రాణా తలో వికెట్ తీయగా.. దీప్తి శర్మ(5/38) ఐదు వికెట్లు పడగొట్టింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత మహిళల జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 255 పరుగులే చేసి ఓటమిపాలైంది. వికెట్ కీపర్ రిచా ఘోష్(117 బంతుల్లో 13 ఫోర్లతో 96) తృటిలో శతకాన్ని చేజార్చుకోగా.. జెమీమా రోడ్రిగ్స్(55 బంతుల్లో 3 ఫోర్లతో 44) హాఫ్ సెంచరీ మిస్ చేసుకుంది.
మిగతా బ్యాటర్లలో దీప్తి శర్మ(24 నాటౌట్), స్మృతి మంధాన(34) మినహా అంతా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అన్నబెల్ సదర్లాండ్ మూడు వికెట్లు తీయగా.. జార్జియో వేర్హమ్ రెండు వికెట్లు పడగొట్టింది. అష్లే గార్డ్నర్, కిమ్ గార్త్ తలో వికెట్ తీసారు.
లక్ష్యచేధనలో రిచా ఘోష్, జెమీమ్ మంచి భాగస్వామ్యం అందించడంతో టీమిండియా విజయం దిశగా సాగింది. 44వ ఓవర్లో రిచా ఘోష్ క్యాచ్ ఔటవ్వడంతో టీమిండియా ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. దీప్తి శర్మ(24 నాటౌట్) ఒంటరి పోరాటం చేసినా.. మరో ఎండ్లో హర్మన్ప్రీత్ కౌర్(5), అమన్జోత్ కౌర్(4), పూజ వస్త్రాకర్(8), హర్లీన్ డియోల్(1) దారుణంగా విఫలమయ్యారు.
చివరి 12 బంతుల్లో భారత్ విజయానికి 19 పరుగులు అవసరమవ్వగా.. అష్లే గార్డనర్ 49వ ఓవర్ కట్టడిగా బౌలింగ్ చేసి ఓ వికెట్ తీయడంతో పాటు 3 పరుగులే ఇచ్చింది. దాంతో టీమిండియా ఓటమి ఖాయమైంది.