
ప్రాక్టీస్లోనూ తడబడ్డ ఆసీస్ బ్యాటర్లు
ఆస్ట్రేలియా స్పిన్నర్ అష్టన్ అగర్తో పాటు స్పిన్ బౌలింగ్ కోచ్ డానియల్ వెటోరీ, నెట్ బౌలర్ మహేష్ పితియా బౌలింగ్ చేయగా.. ఆసీస్ బ్యాటర్లు స్మిత్, లబుషేన్, కామెరూన్ గ్రీన్, డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ సెషన్లోనూ ఆసీస్ బ్యాటర్లు తడబడ్డారు. ముఖ్యంగా అష్టన్ అగర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యారు.
డానియల్ వెటోరీ త్రోడౌన్స్ను కూడా ఎదుర్కోలేకపోయారు. ఈ సెషన్కు సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తమ అధికారిక ట్విటర్ పేజీలో అభిమానులతో పంచుకుంది. ఐదు రోజుల జరగాల్సిన మ్యాచ్ రెండున్నర రోజుల్లోనే ముగియడంతో మిగిలిన రోజులను ఇరు జట్లు ప్రాక్టీస్కు వాడుకున్నాయి. మంగళవారం రెండో టెస్ట్ వేదికైన ఢిల్లీ బయల్దేరనున్నాయి.
నీళ్లు జల్లడంతో...
వాస్తవానికి ఆస్ట్రేలియా జట్టు నాగ్పూర్ స్టేడియంలోని సెంట్రల్ వికెట్పై ఆదివారమే ప్రాక్టీస్ చేయాలని భావించింది. స్పిన్కు అనుకూలించే పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకోవాలని అనుకుంది. శనివారమే మొదటి టెస్ట్ ముగియగా.. ఆదివారానికి తమకు సెంటర్ వికెట్తోపాటు ట్రైనింగ్ పిచ్లను అందుబాటులో ఉంచాలని ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ గ్రౌండ్ స్టాఫ్కు సూచించారు.
కానీ శనివారం రాత్రే స్టేడియం మొత్తం నీటితో తడిపామని సిబ్బంది చెప్పారు. దీంతో రెండో టెస్టు ప్రారంభానికి ముందు స్పిన్ ట్రాక్పై ప్రాక్టీస్ చేసి, పిచ్ స్వభావం తెలుసుకోవాలనుకున్న ఆసీస్ వ్యూహం బెడిసికొట్టింది.
ఆసీస్ మేనేజ్మెంట్ అసంతృప్తి..
నాగ్పూర్ గ్రౌండ్ స్టాఫ్ చేసిన పని పట్ల ఆసీస్ మేనేజ్మెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాచ్ ముగిసాక పిచ్ను సాధారణంగా తడపరని.. కానీ గ్రౌండ్ స్టాఫ్ చేసిన పనితో తమ టాప్ ఆర్డర్ బ్యాటర్లు ప్రాక్టీస్ చేసే అవకాశాన్ని కోల్పోయారని ఆ జట్టు కోచ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నీళ్ల జల్లడంతో ఆదివారం నెట్స్కే పరిమితమైన ఆసీస్ ఆటగాళ్లు.. సోమవారం సెంట్రల్ వికెట్పై కోచ్ సమక్షంలో ప్రాక్టీస్ చేశారు. అయితే పిచ్పై నీళ్లు జల్లితే అసలు స్వభావం పోతుందని, ఆసీస్ బ్యాటర్లు ప్రాక్టీస్ చేసినా లాభం ఉండదని విశ్లేషకులు అంటున్నారు.

వార్నర్పై వేటు..
నాగ్పూర్లో ఘోర ఓటమి నేపథ్యంలో ఢిల్లీ టెస్టు కోసం ఆస్ట్రేలియా తుది జట్టులో మార్పులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్థానంలో ట్రావిస్ హెడ్ను ఆడించే అవకాశం ఉంది. కాగా ఆసీస్ మాజీలు మరోసారి వార్నర్కు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఢిల్లీ పిచ్కు స్పిన్కు అనుకూలించే అవకాశం ఉండటంతో.. ఆస్ట్రేలియా జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పిన్నర్ మ్యాట్ ఖునేమన్ను ఆసీస్ ఆడించే ఛాన్స్ ఉంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ శుక్రవారం (ఫిబ్రవరి 19న) ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications












