ఆ ముగ్గురే కొట్టేసారు..
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా.. భారత స్పిన్నర్ల ధాటికి 177 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈ పరుగులను భారత జట్టులోని ముగ్గురు ప్లేయర్లే అధిగమించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అది కూడా లోయరార్డర్ బ్యాటర్లు సాధించడం విశేషం. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీలు కలిసి 191 పరుగులు చేయగా.. ఆసీస్ బ్యాటర్లంతా కలిసి 177 రన్స్ చేశారు. దాంతో ఆసీస్పై భారత అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్ల చెంప చెళ్లు మనేలా..?
భారత్.. తమకు అనుకూలంగా స్పిన్ వికెట్ తయారు చేసుకుందని, ఈ పిచ్పై 300 పరుగులు కూడా చేయలేరని విమర్శించిన ఆసీస్ మాజీ క్రికెటర్లు, మీడియాపై విమర్శలు గుప్పిస్తున్నారు. భారత టెయిలెండర్లు స్వేచ్చగా ఆడిన ఈ వికెట్ గురించి ఇప్పుడేం చెబుతారని ప్రశ్నిస్తున్నారు.
ఆడే దమ్ము ఉంటే పిచ్ది ఏం ఉంటుందని, పిచ్ గురించి అనవసరంగా మాట్లాడిన ఆస్ట్రేలియా.. ఇప్పుడు నోరు మూసుకుందని విమర్శిస్తున్నారు. మహమ్మద్ షమీ వరుస సిక్సర్లతో చెలరేగాడని గుర్తు చేస్తున్నారు.
షమీ మెరుపులు..
321/7 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా 139.3 ఓవర్లలో 400 పరుగులకు కుప్పకూలింది. ఓవర్నైట్ బ్యాటర్ రవీంద్ర జడేజా(70) త్వరగానే ఔటైనా.. అక్షర్ పటేల్(174 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 84) సెంచరీ చేజార్చుకున్నా.. కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.
టెయిలెండర్ మహమ్మద్ షమీ(47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 37)విలువైన పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ ఏడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు పడగొట్టాడు. నాథన్ లియోన్ ఓ వికెట్ తీసాడు.
తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్..
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(5) వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్లో అతను స్లిప్ క్యాచ్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో మార్నస్ లబుషేన్తో పాటు డేవిడ్ వార్నర్ ఉన్నాడు.


Click it and Unblock the Notifications












