ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్లోనూ టీమిండియా బౌలర్లు తేలిపోయారు. మళ్లీ జస్ప్రీత్ బుమ్రా(4/99) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా.. రవీంద్ర జడేజా(3/78) పర్వాలేదనిపించాడు. ఒక ఎండ్లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే మరో ఎండ్లో అతనికి సహకారం లభించలేదు. దాంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 474 పరుగుల భారీ స్కోర్ చేసింది.
స్టీవ్ స్మిత్(197 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 140) భారీ శతకంతో చెలరేగగా..సామ్ కోన్స్టాస్(65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 60), ఉస్మాన్ ఖవాజా(121 బంతుల్లో 6 ఫోర్లతో 57), మార్నస్ లబుషేన్(145 బంతుల్లో 7 ఫోర్లతో 72)హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాతో పాటు ఆకాశ్ దీప్కు రెండు వికెట్లు దక్కగా.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీసాడు.

మహమ్మద్ సిరాజ్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. కానీ ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. 23 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ 5.30 ఎకానమీతో 122 పరుగులిచ్చుకున్నాడు. అతని కెరీర్లోనే ఇది అత్యంత చెత్త రికార్డ్. సిరాజ్ వైఫల్యం ఆసీస్కు కలిసొచ్చింది.
స్మిత్ భారీ శతకం..
311/6 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. స్మిత్ సెంచరీతో తమ ఆధిపత్యం కొనసాగించింది. 68 పరుగుల వ్యక్తిగత ఓవర్నైట్ స్కోర్తో బరిలోకి దిగిన స్మిత్.. 167 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అతనికి మరో ఎండ్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సహకారం అందించాడు. ఈ ఇద్దరూ భారత బౌలర్లను చెడుగుడు ఆడారు. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు.
తొలి సెషన్ చివర్లో హాఫ్ సెంచరీకి చేరువైన ప్యాట్ కమిన్స్(49)ను జడేజా.. నితీష్ కుమార్ రెడ్డి స్టన్నింగ్ క్యాచ్తో పెవిలియన్ చేర్చాడు. దాంతో ఏడో వికెట్కు నమోదైన 112 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి మిచెల్ స్టార్క్ రాగా.. మరో వికెట్ పడకుండా స్మిత్ జాగ్రత్తగా ఆడాడు. దాంతో ఆసీస్ 454/7 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది. రెండో సెషన్ ఆరంభంలోనే మిచెల్ స్టార్క్(15)ను జడేజా క్లీన్ బౌల్డ్ చేయగా.. ఆ మరుసటి ఓవర్లోనే స్టీవ్ స్మిత్ విచిత్రకర రీతిలో పెవిలియన్ చేరాడు.
అన్ లక్కీగా..
ఆకాశ్ దీప్ బౌలింగ్లో స్టెప్ ఔటై స్మిత్ ఆఫ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి అతని ప్యాడ్స్ను తాకి మెల్లిగా లెగ్ స్టంప్ బెయిల్ను కిందపడేసింది. నిస్సహాయంగా స్మిత్ చూస్తూ నిలబడిపోయాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు. అసాధారణ బ్యాటింగ్ చేసిన స్టీవ్ స్మిత్కు మెల్ బోర్న్ ప్రేక్షకులు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా స్మిత్ను అభినందించాడు.
స్కాట్ బోలాండ్, నాథన్ లయన్ కాసేపు భారత బౌలర్లను విసిగించారు. జడేజా, సిరాజ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. దాంతో రోహిత్ బుమ్రాను రంగంలోకి దింపగా అతను నాథన్ లయన్ను ఎల్బీగా పెవిలియన్ చేర్చి ఆసీస్ ఇన్నింగ్స్ తెరదించాడు.