IND vs AUS: ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ను టీమిండియా విజయంతో ముగించింది. బెంగళూరు వేదికగా ఆదివారం జరిగిన నామమాత్రపు చివరి మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ లోస్కోరింగ్ థ్రిల్లర్లో ముఖేశ్ కుమార్(3/32), అర్ష్దీప్ సింగ్(2/40) రఫ్ఫాడించడంతో టీమిండియా విజయాన్నందుకుంది.
ఆఖరి ఓవర్లో అర్ష్దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఆసీస్ విజయానికి కావాల్సిన 10 పరుగులు డిఫెండ్ చేయడమే కాకుండా.. మాథ్యూ వేడ్ను ఔట్ చేసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ గెలుపుతో టీమిండియా 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 31) అతనికి అండగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాసన్ బెహ్రాండార్ఫ్, బెన్ రెండేసి వికెట్లు తీయగా.. ఆరోన్, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసి ఓటమిపాలైంది. బెన్ మెక్డెర్మోట్(36 బంతుల్లో 5 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. చివర్లో మాథ్యూ వేడ్(15 బంతుల్లో 4 ఫోర్లతో 22) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో ముఖేశ్ కుమార్ మూడు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్కు ఓ వికెట్ దక్కింది.
స్వల్ప లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే జోష్ ఫిలిప్(4)ను ముఖేష్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ధాటిగా ఆడిన ట్రావిస్ హెడ్(28)ను రవిబిష్ణోయ్ పెవిలియన్ చేర్చగా.. ఆసీస్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 50 పరుగులు చేసింది. ఆరోన్ హార్డీ(6)ని రవిబిష్ణోయ్ పెవిలియన్ చేర్చగా.. నిలకడగా ఆడుతున్న టీమ్ డేవిడ్ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు.
34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని జోరు కనబర్చిన బెన్ మెక్డెర్మాట్ను అర్ష్దీప్ సింగ్ ఔట్ చేయగా.. మాథ్యూ షార్ట్ను ముఖేష్ కుమార్ పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీసాడు. ఆఖరి ఓవర్లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మాథ్యూ వేడ్ కూడా ఔటవ్వడంతో భారత విజయం లాంఛనమైంది.