
ఇండోర్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్లో టీమిండియా ఓటమి దిశగా సాగుతోంది. టర్నింగ్ ట్రాక్పై భారత బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఆసీస్ ముందు 76 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. అద్భుతం జరిగితే తప్పా ఈ మ్యాచ్లో భారత్ ఓటమి తప్పించుకోలేదు. ఓవైపు ఓటమి భయం వెంటాడుతుండగా.. మరోవైపు బీసీసీఐకి ఇండోర్ పిచ్ కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. తొలి రోజు నుంచే టర్నింగ్ ఉన్న ఈ వికెట్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యావరేజ్గా 4.8 డిగ్రీలు టర్న్ అయిన బంతి.. గరిష్టంగా 8.8 డిగ్రీల మేర తిరిగింది. దాంతో ఈ పిచ్పై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కూడా ఈ పిచ్కు బిలో యావరేజ్ రేటింగ్ ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్స్లో కోతపడనుంది. తొలి రోజు 14 వికెట్లు పడగా.. రెండో రోజు 16 వికెట్లు నేలకూలాయి. ఈ వికెట్పై ఆసీస్ మాజీ క్రికెటర్లు మాథ్యూ హెడెన్, ఇయాన్ చాపెల్తో పాటు టీమిండియా మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. చాపెల్ అయితే ఈ పిచ్కు ఐసీసీ మ్యాచ్ రిఫరీ.. బిలో యావరేజ్ రేటింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బ్యాటర్లకు ఏమాత్రం అనుకూలంగా లేని ఇటువంటి పిచ్ లను తయారచేయడం వల్ల టెస్టు క్రికెట్ను అపహస్యం చేసినట్టే అవుతుందని మండిపడ్డాడు.
దిలీప్ వెంగ్ సర్కార్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.'మంచి క్రికెట్ను చూడాలనుకున్న వారికి ఇలాంటి పిచ్లు పూర్తిగా నిరాశ కలిగిస్తాయి. బౌలర్లు, బ్యాటర్లకు అనుకూలించేలా పిచ్ లను తయారుచేయాలి. అప్పుడు బ్యాట్ బాల్ మధ్య ఆసక్తికర పోరు కొనసాగుతుంది. కానీ మొదటి రోజు తొలి గంటలోనే బంతి అంతలా టర్న్ అవుతే అది టెస్టు క్రికెట్ను అవమానించినట్టే.'అని ఘాటుగా విమర్శించాడు.
ధర్మశాల వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ను చివరి నిమిషంలో ఇక్కడకు మార్చడమే సమస్యగా మారినట్లు తెలుస్తోంది. సాధారణంగా టెస్ట్ మ్యాచ్కు పిచ్ సిద్దం చేయాలంటే నెల రోజులు పడుతోంది. కానీ ఇండోర్ వేదికగా రంజీ మ్యాచ్లు జరగడం.. చివరి నిమిషంలో ఇక్కడికి మూడో టెస్ట్ను షిఫ్ట్ చేయడంతో క్యురేటర్కు తగిన సమయం లభించలేదు. దాంతోనే ఈ తరహా వికెట్ తయారైందని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి.