ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్ట్కు టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతని విషయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హర్షిత్ రాణాపై వేటు వేసి ఆకాశ్ దీప్కు అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఈ సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. దాంతో గబ్బా వేదికగా శనివారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టుకు సిరీస్పై పట్టు చిక్కనుంది. దాంతో విజయమే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి.

పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో మెరుగ్గా రాణించిన హర్షిత్ రాణా.. పింక్ బాల్తో మాత్రం తేలిపోయాడు. పేలవ బౌలింగ్తో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లపై అనవసర ఒత్తిడిని తెచ్చాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 16 ఓవర్లు వేసిన హర్షిత్ రాణా 86 పరుగులిచ్చుకున్నాడు. వన్డే తరహా గణంకాలను టెస్ట్ల్లో నమోదు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.
పింక్ బాల్తో ఆడిన అనుభవం లేకపోవడంతోనే హర్షిత్ రాణా ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే హర్షిత్ రాణాపై వేటు వేసి ఆకాశ్ దీప్ను తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. టీమిండియా మేనేజ్మెంట్ కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది. గురువారం జరిగిన నెట్ సెషన్లో ఆకాశ్ దీప్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేశాడు. దాంతో మూడో టెస్ట్లో అతను ఆడటం అతను ఖాయమని అర్థమవుతోంది.
బ్రిస్బేన్లోని గబ్బా మైదానం పిచ్ పేస్ బౌలింగ్కు అనుకూలంగా ఉంటుంది. కొత్త బంతితో స్వింగ్ లభిస్తోంది. న్యూ బాల్తో స్వింగ్ చేయడంలో ఆకాశ్ దీప్ స్పెషలిస్ట్. ఆకాశ్ దీప్కు కొత్త బంతిని అందిస్తే.. సిరాజ్తో మిడిల్ ఓవర్లు వేయించేందుకు ఆస్కారం లభిస్తోంది. బుమ్రా, సిరాజ్లతో ఒకేసారి బౌలింగ్ చేయించడం ద్వారా ఆసీస్ బ్యాటర్లు వారిని ఓపికగా ఆడి ఇతర బౌలర్లను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆకాశ్దీప్కు అవకాశం ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది.