
అహ్మదాబాద్: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి మూడు టెస్ట్లకు ఉపయోగించిన స్పిన్ పిచ్లపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో చివరి టెస్ట్కు ఫ్లాట్ వికెట్ సిద్దం చేయడం సరికాదని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. అహ్మదాబాద్ వికెట్పై ట్విటర్ వేదికగా స్పందించిన ఆకాశ్ చోప్రా.. 'ఒక విపరీతమైన చర్యను సమర్థించడానికి ఎప్పుడూ మరొక విపరీతమైన చర్య కారణంగా లేదా సాకుగా ఉండకూడదు'అని ట్వీట్ చేశాడు. విపరీతమైన టర్నింగ్ ట్రాక్స్పై జరిగిన తొలి మూడు టెస్ట్లు మూడు రోజుల్లోనే ముగిసాయి. ముఖ్యంగా ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్లో బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు.
దాంతో ఐసీసీ ఇండోర్ వికెట్కు పూర్ రేటింగ్ ఇచ్చింది. దాంతో నాలుగో టెస్ట్కు బ్యాటింగ్ ట్రాక్ను సిద్దం చేశారు. అహ్మదాబాద్ మైదానంలో రెండో రోజు చివర్లో పది ఓవర్లు మినహా.. ఆసీస్ బ్యాటర్లే పూర్తిగా బ్యాటింగ్ చేశారు. ఏకంగా తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 480 పరుగులు సాధించింది. కానీ, ఇదే పిచ్పై రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీసి సత్తా చాటాడు. సరైన ప్రాంతంలో బంతులేస్తే వికెట్లు తీయొచ్చని చాటి చెప్పాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఉస్మాన్ ఖవాజా(180), కామెరూన్ గ్రీన్ (114) సెంచరీలతో తొలి ఇన్నింగ్స్లో 480 పరుగులు చేసింది.రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్కు చెరొక వికెట్ దక్కింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ధీటుగా బదులిస్తోంది. శుభ్మన్ గిల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ ముంగిట పుజారా(42) ఔటవ్వగా.. క్రీజులోకి విరాట్ కోహ్లీ వచ్చాడు. 71 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్లకు 209 పరుగులు చేసింది.