ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లోనూ టీమిండియా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. మరోసారి రిషభ్ పంత్(33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 61) విధ్వంసకర హాఫ్ సెంచరీతో టీమిండియాను ఆదుకున్నాడు. పంత్ మినహా మరే బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 32 ఓవర్లలో 6 వికెట్లకు 141 పరుగులు చేసింది.
క్రీజులో రవీంద్ర జడేజా(8 బ్యాటింగ్)తో పాటు వాషింగ్టన్ సుందర్(6 బ్యాటింగ్) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్(4/42) నాలుగు వికెట్లతో భారత పతనాన్ని శాసించగా.. ప్యాట్ కమిన్స్ , బ్యూ వెబెస్టర్ తలో వికెట్ తీసారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 145 పరుగులకు చేరింది. ఆసీస్ ముందు 250 ప్లస్ టార్గెట్ పెడితే భారత్ ఈ మ్యాచ్లో విజయం సాధిస్తుంది. లేదంటే మరో ఘోర పరాజయం తప్పదు.

జైస్వాల్ దూకుడు..
4 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు యశస్వి జైస్వాల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్లోనే నాలుగు బౌండరీలతో దూకుడు కనబర్చాడు. కేఎల్ రాహుల్ కూడా తనదైన శైలిలో బ్యాటింగ్ చేయడంతో వేగంగా పరుగులు వచ్చాయి. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని విడదీసేందుకు కమిన్స్.. స్కాట్ బోలాండ్ను రంగంలోకి దింపాడు. అతను అద్భుతమైన బౌలింగ్తో వరుస ఓవర్లలో కేఎల్ రాహుల్(13), యశస్వి జైస్వాల్(22)లను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 42 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(6) మరోసారి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీకి వెనుదిరిగాడు. కోహ్లీ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్.. తొలి బంతినే సిక్సర్గా తరలించాడు. ధాటిగా ఆడే క్రమంలో శుభ్మన్ గిల్(13) వెబ్స్టర్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. గిల్ ఔటైనా.. జడేజా సాయంతో పంత్ చెలరేగాడు. వరుస బౌండరీలతో పాటు భారీ సిక్సర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

రిషభ్ పంత్ విధ్వంసం..
పంత్ విధ్వంసకర బ్యాటింగ్తో టీమిండియా స్కోర్ బోర్డ్ వేగంగా పరుగెత్తింది. ఈ క్రమంలో స్టార్క్ బౌలింగ్లో భారీ సిక్స్ బాదిన పంత్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అతను అదే జోరు కనబర్చాడు. ప్రమాదకరంగా మారిన పంత్ను ఔట్ చేసేందుకు కమిన్సే రంగంలోకి దిగాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీతో బోల్తా కొట్టించాడు. దాంతో ఐదో వికెట్కు నమోదైన 46 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి(4) మరోసారి నిరాశపర్చాడు. సుందర్తో కలిసి జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు.
ఆసీస్ 181 ఆలౌట్..
అంతకుముందు 9/1 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 181 పరుగులకు ఆలౌటైంది. బ్యూ వెబ్స్టర్(105 బంతుల్లో 5 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. స్టీవ్ స్మిత్(57 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 33) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/51), ప్రసిధ్ కృష్ణ(3/42)లతో పాటు జస్ప్రీత్ బుమ్రా(2/33), నితీష్ కుమార్ రెడ్డి(2/32) రెండేసి వికెట్లు పడగొట్టారు. గాయంతో బుమ్రా మధ్యలోనే వెనుదిరిగినా.. సిరాజ్, ప్రసిధ్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులు చేసిన విషయం తెలిసిందే.