ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా: టీమిండియా తాత్కలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో చివరి టీ20లో శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్లకు అవకాశం ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు. ఐదు టీ20ల సిరీస్లో ఇప్పటికే 3-1తో సిరీస్ గెలిచినా.. నామమాత్రపు మ్యాచ్లో బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమని మండిపడుతున్నారు.
ఈ సిరీస్కు ఎంపికైన 17 మంది సభ్యుల్లో 15 మందికి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. కానీ వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబేలకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. కనీసం చివరి మ్యాచ్లోనైనా వారికి అవకాశం ఇస్తారని అభిమానులు భావించారు. కానీ మరోసారి వారికి నిరాశే ఎదురైంది. వరుసగా నాలుగు మ్యాచ్ల్లోనూ అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్లనే కొనసాగించారు. వారి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబేలను ఆడించాల్సిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

హార్దిక్ పాండ్యాకు బ్యాకప్గా శివమ్ దూబేను రెడీ చేసుకోవాల్సిన అవసరం టీమిండియాకు ఉందని గుర్తు చేస్తున్నారు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో టీమిండియా పరాజయానికి పేస్ ఆల్రౌండర్ లేకపోవడమే కారణమని, కనీసం టీ20 ప్రపంచకప్కైనా ఆ సమస్య రాకుండా చూడాలని గుర్తు చేస్తున్నారు. నామమాత్రపు మ్యాచ్లో శివమ్ దూబేకు అవకాశం ఇస్తే జట్టుకు ఏమైనా నష్టం జరిగేదా? అని ప్రశ్నిస్తున్నారు.
టీమ్కాంబినేషన్లో భాగంగానే శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్లకు అవకాశం కల్పించలేకపోయామని టాస్ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. మా ఆటగాళ్లకు నేను ఒక్కటే చెప్పాను. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయడం లేదు. ప్రేక్షకులతో కిక్కిరిసే మైదానంలో ఆడేందుకు మీకు మరో అవకాశం ఇస్తున్నా.
నిర్భయంగా ఆటను ఆస్వాదించండని చెప్పాను. ఇప్పటి వరకు బ్యాటింగ్ యూనిట్ ఎలా రాణించిందో అదే కొనసాగించాలని చెప్పాను. దీపక్ చాహర్ ఇంటికి వెళ్లడంతో అర్ష్దీప్ సింగ్ను తుది జట్టులోకి తీసుకున్నాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. రెండు భారీ సిక్సర్లతో దూకుడు కనబర్చిన యశస్వీ జైస్వాల్(21)తో పాటు మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(10) వరుస ఓవర్లలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగారు. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(5)తో పాటు రింకూ సింగ్ కూడా విఫలమవడంతో టీమిండియా 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో జితేశ్ శర్మ(24)తో కలిసి శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ ధాటిగా ఆడే క్రమంలో జితేశ్ శర్మ కూడా ఔటవ్వడంతో 97 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ సాయంతో.. శ్రేయస్ అయ్యర్ పోరాడుతున్నాడు.