IND vs AUS: ఆస్ట్రేలియాతో ఐదో టీ20లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. శ్రేయస్ అయ్యర్(37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 53) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. అయ్యర్కు తోడుగా అక్షర్ పటేల్(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 31) రాణించాడు.
జితేశ్ శర్మ(24), యశస్వీ జైస్వాల్(21) పర్వాలేదనిపించారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(5)తో పాటు రుతురాజ్ గైక్వాడ్(10), రింకూ సింగ్(6) దారుణంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాసన్ బెహ్రాండార్ఫ్, బెన్ రెండేసి వికెట్లు తీయగా.. ఆరోన్, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా తలో వికెట్ తీసారు.

ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. రెండు భారీ సిక్సర్లతో దూకుడు కనబర్చిన యశస్వీ జైస్వాల్(21)తో పాటు మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(10) వరుస ఓవర్లలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగారు. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(5)తో పాటు రింకూ సింగ్ కూడా విఫలమవడంతో టీమిండియా 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో జితేశ్ శర్మ(24)తో కలిసి శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ ధాటిగా ఆడే క్రమంలో జితేశ్ శర్మ కూడా ఔటవ్వడంతో 97 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ సాయంతో.. శ్రేయస్ అయ్యర్ జట్టును ఆదుకున్నాడు.
36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అయ్యర్.. ఆరో వికెట్కు అక్షర్ పటేల్తో కలిసి 46 పరుగులు జోడించి గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.