ఐదు టీ20ల సిరీస్లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఆఖరి టీ20కి అంతరాయం కలిగిస్తోంది. ప్రతికూల వాతావరణం కారణంగా అంపైర్లు మ్యాచ్ను నిలిపేసారు. బ్రిస్బేన్లోని గబ్బా మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. మ్యాచ్ ఆగిపోయే సమయానికి 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్(16 బంతుల్లో 6 ఫోర్లతో 29 బ్యాటింగ్), అభిషేక్ శర్మ(13 బంతుల్లో ఫోర్, సిక్స్తో 23) దూకుడుగా ఆడారు.
బెన్ ద్వార్షూయిస్ వేసిన తొలి ఓవర్లోనే ఐదు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అభిషేక్ శర్మ ఇచ్చిన సునాయస క్యాచ్ను గ్లేన్ మ్యాక్స్వెల్ నేలపాలు చేశాడు. బౌండరీలు బాదేందుకు అభిషేక్ కాస్త ఇబ్బంది పడినా శుభ్మన్ గిల్ క్లాస్ బ్యాటింగ్తో బౌండరీలు బాదాడు. ద్వార్షూయిస్ మరుసటి ఓవర్లో నాలుగు బౌండరీలు బాదాడు.

ఇక నాథన్ ఎల్లిస్ వేసిన నాలుగో ఓవర్లో అభిషేక్ శర్మ ఇచ్చిన క్యాచ్ను ద్వార్షూయిస్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో అభిషేక్ శర్మ ఓ భారీ సిక్స్ బాదాడు. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో 1000 పరుగులు చేసుకున్నాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బ్యాటర్గా నిలిచాడు. అభిషేక్ శర్మ 528 బంతుల్లోనే 1000 పరుగులు సాధించాడు. ఇందుకు అతను 28 ఇన్నింగ్స్లు ఆడాడు. కోహ్లీ మాత్రం 27 ఇన్నింగ్స్ల్లో 1000 పరుగులు చేసి టాప్ ఇండియా బ్యాటర్గా కొనసాగుతున్నాడు.
వర్షం రాకున్నా మైదానాన్ని మబ్బులు కమ్మేయడంతో పాటు ఉరుములు కూడిన గాలివాన వచ్చే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో మ్యాచ్ను నిలిపేసారు. మైదానంలోని బిగ్ స్క్రీన్పై ఫ్యాన్స్కు హెచ్చరిక జారీ చేశారు. 'ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం రానుంది. బయటి ప్రదేశాల్లో ఉండటం సురక్షితం కాదు.'అని వార్నింగ్ ఇచ్చింది. ప్రేక్షకులందరిని స్టాండ్ల కిందికి తరిలించారు. ప్రస్తుతం మంచుతో కూడిన వర్షం పడుతుంది. వర్షం తీవ్రత చూస్తుంటే మ్యాచ్ తిరిగిన ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మ్యాచ్ రద్దయితే 2-1తో సిరీస్ భారత్ కైవసం కానుంది.