ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. మెల్ బోర్న్ వేదికగా సోమవారం ముగిసిన నాలుగో టెస్ట్లో 184 పరుగుల భారీ తేడాతో టీమిండియాను ఓడించింది. 340 పరుగుల భారీ లక్ష్యచేధనకు బరిలోకి దిగిన టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 155 పరుగులకు కుప్పకూలింది.
యశస్వి జైస్వాల్(208 బంతుల్లో 8 ఫోర్లతో 84) ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ప్యాట్ కమిన్స్(3/28), స్కాట్ బోలాండ్(3/39) మూడేసి వికెట్లు తీయగా.. నాథన్ లయన్(2/37) రెండు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్ తలో వికెట్ తీసారు.

మరో 12 ఓవర్ల పాటు భారత్ క్రీజులో కొనసాగి ఉండి ఉంటే ఈ మ్యాచ్లో ఓటమి నుంచి గట్టెక్కేది. ఓ దశలో రిషభ్ పంత్(30), యశస్వి జైస్వాల్ నాలుగో వికెట్కు 78 పరుగుల భాగస్వామ్యంతో ఈ మ్యాచ్ డ్రా దిశగా సాగింది. దాదాపు ఈ ఇద్దరూ 22 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశారు. ఈ ఇద్దర్నీ ఔట్ చేయలేక ఆసీస్ బౌలర్లు చేతులెత్తేసారు. ఈ క్రమంలో పార్ట్ టైమ్ బౌలర్ ట్రావిస్ హెడ్.. టెంప్టింగ్ బాల్తో రిషభ్ పంత్ను బుట్టలో వేసుకున్నాడు.
నిర్లక్ష్యపు షాట్ రిషభ్ పంత్ వెనుదిరగడంతో భారత ఇన్నింగ్స్ పేకమేడల్లా కుప్పకూలింది. రవీంద్ర జడేజా, సెంచరీ హీరో నితీష్ కుమార్ రెడ్డి(1) వెనువెంటనే ఔటవ్వడంతో ఈ మ్యాచ్పై ఆసీస్ పట్టు బిగించింది. నిలకడగా ఆడుతున్న యశస్వి జైస్వాల్ కూడా ఔటవ్వడంతో ఆసీస్ విజయం సునాయసమైంది.
ఐదు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్లో భారత్ అద్భుతంగా పోరాడినా.. టాపార్డర్ బ్యాటింగ్ వైఫల్యం కొంపముంచింది. రిషభ్ పంత్ నిర్లక్ష్యపు షాట్ ఆడకుండా డ్రా కోసం ప్రయత్నించి ఉంటే ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమి తప్పించుకునేది.
ఈ ఓటమితో ఐదు టెస్ట్ల సిరీస్లో ఆసీస్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఆఖరి టెస్ట్ జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ ఓటమితో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి టీమిండియా దాదాపు తప్పుకుంది. అద్భుతం జరిగితే తప్పా భారత్ ఫైనల్ చేరలేదు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్లో 474 పరుగుల భారీ స్కోర్ చేయగా.. భారత్ 369 పరుగులకు ఆలౌటైంది. నితీష్ కుమార్ రెడ్డి అసాధారణ సెంచరీతో భారత్ ఈ మ్యాచ్లో పట్టు సాధించింది. 105 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 234 పరుగులకు ఆలౌటైంది. సెకండ్ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ మూడు క్యాచ్లు నేలపాలు చేయడం టీమిండియా విజయవశాలను దెబ్బతీసింది.