ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా బ్యాటర్ల తడబాటు కొనసాగుతోంది. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్లోనూ భారత బ్యాటర్లు తీవ్రంగా నిరాశపర్చారు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై కూడా పరుగులు చేయలేకపోయారు. ప్రత్యర్థి బ్యాటర్లు భారీ స్కోర్ చేసిన వికెట్పై పేలవ బ్యాటింగ్తో పెవిలియన్కు క్యూ కట్టారు. దాంతో ఈ మ్యాచ్పై ఆస్ట్రేలియా పట్టుబిగించింది.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 46 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(118 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 82) శతకం చేజార్చుకోగా.. విరాట్ కోహ్లీ(86 బంతుల్లో 4 ఫోర్లతో 36) మరోసారి నిరాశపరిచాడు. క్రీజులో రిషభ్ పంత్(6 బ్యాటింగ్)తో పాటు రవీంద్ర జడేజా(4) ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్, ప్యాట్ కమిన్స్ రెండేసి వికెట్లు తీసారు.

ఆసీస్ భారీ స్కోర్..
అంతకుముందు 311/6 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 474 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్(197 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 140) భారీ శతకంతో చెలరేగగా..సామ్ కోన్స్టాస్(65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 60), ఉస్మాన్ ఖవాజా(121 బంతుల్లో 6 ఫోర్లతో 57), మార్నస్ లబుషేన్(145 బంతుల్లో 7 ఫోర్లతో 72)హాఫ్ సెంచరీలతో రాణించారు.
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్కు రెండు వికెట్లు దక్కగా.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీసాడు.
నిరాశపర్చిన రోహిత్..
అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మళ్లీ ఓపెనర్గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ(3) చెత్త షాట్తో పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్(24)తో యశస్వి జైస్వాల్ ఆచితూచి ఆడాడు. మరోవైపు రాహుల్ కూడా సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. క్రీజులో సెట్ అవుతున్న ఈ జోడీని ప్యాట్ కమిన్స్ విడదీసాడు. స్టన్నింగ్ డెలివరీతో కేఎల్ రాహుల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో 2వ వికెట్కు నమోదైన 43 పరుగుల స్వల్ప భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి విరాట్ కోహ్లీ రాగా.. యశస్వి జైస్వాల్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. ఓపికగా ఆడుతూ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. కోహ్లీ సైతం చాలా ఓపికగా ఆడాడు. ముఖ్యంగా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీల జోలి పోకుండా తనను తాను నియంత్రించుకున్నాడు. కోహ్లీ నిదానంగా ఆడినా.. యశస్వి జైస్వాల్ మాత్రం బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలో అతను 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
కొంపముంచిన యశస్వి రనౌట్..
ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన అతను వేగంగా పరుగులు చేస్తూ శతకం దిశగా సాగాడు. 102 పరుగుల భాగస్వామ్యంతో ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ఈ జోడీని విడదీసేందుకు కమిన్స్ తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఏ బౌలర్కు లొంగని ఈ జోడీ క్రమశిక్షణతో బ్యాటింగ్ చేసింది. కానీ ఇక్కడే యశస్వి జైస్వాల్ అత్యుత్సాహంతో లేని పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. ఈ తప్పిదంతో శతకం చేజార్చుకోవడంతో పాటు టీమిండియాను కష్టాల్లోకి నెట్టాడు.
యశస్వి జైస్వాల్ తన వల్లే ఔటయ్యాడనే బాధనో లేక ఏకాగ్రత కోల్పోయాడో తెలియదు కానీ అప్పటి వరకు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ జోలికి పోని కోహ్లీ.. స్కాట్ బోలాండ్ బౌలింగ్లో అదే తరహా బంతిని ఆడబోయి కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. నైట్ వాచ్ మన్గా వచ్చిన ఆకాశ్ దీప్ కూడా ఔటవ్వడంతో 159 పరుగులకే టీమిండియా సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన జడేజా, పంత్ మరో వికెట్ పడకుండా తొలి రోజు ఆటను ముగించారు.