ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్లో మూడో రోజు వరణుడు ఆధిపత్యం చెలాయించాడు. పదే పదే అంతరాయం కలిగించడంతో సోమవారం 33 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వర్షం కారణంగా ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులే చేసింది.
మరోసారి టీమిండియా టాప్-4 బ్యాటర్లు యశస్వి జైస్వాల్(4), శుభ్మన్ గిల్(1), విరాట్ కోహ్లీ(3), రిషభ్ పంత్(9) దారుణంగా విఫలమవ్వగా.. కేఎల్ రాహుల్(33 బ్యాటింగ్)తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ(0) క్రీజులో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్, ప్యాట్ కమిన్స్ తలో వికెట్ తీసారు.

అంతకుముందు 405/7 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. 445 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓవర్నైట్ బ్యాటర్ అలెక్స్ క్యారీ(70) హాఫ్ సెంచరీ సాధించగా.. మిచెల్ స్టార్క్(18) త్వరగానే ఔటయ్యాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ను భారత్.. బౌండరీతో మొదలుపెట్టింది. కానీ ఆ మరుసటి బంతికే ఓపెనర్ యశస్వీ జైస్వాల్(4) క్యాచ్ ఔట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన శుభ్మన్ గిల్(1) స్లిప్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఆదుకుంటాడని భావించిన కోహ్లీ.. మరోసారి తన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీకి వెనుదిరిగాడు. ఈ దశలో రెండు సార్లు వర్షం అంతరాయం కలిగించింది.
ఆట తిరిగి ప్రారంభమవ్వగానే.. కమిన్స్ బౌలింగ్లో రిషభ్ పంత్(9) ఔటయ్యాడు. ఓవైపు వరణుడు.. మరోవైపు వికెట్లు పడుతున్నా.. కేఎల్ రాహుల్ ఏకాగ్రతతో బ్యాటింగ్ చేశాడు. తనకే సాధ్యమైన కవర్ డ్రైవ్లతో అలరించాడు. రాహుల్తో పాటు క్రీజులో ఉన్న రోహిత్ శర్మ.. ఇతర బ్యాటర్లు నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజాలపైనే భారత్ ఆధారపడి ఉంది. ఫాలో ఆన్ గండం తపపించుకోవాలంటే భారత్ కనీసం 246 పరుగులు చేయాలి. నాలుగో రోజు పూర్తిగా బ్యాటింగ్ చేస్తేనే.. ఈ మ్యాచ్లో భారత్ ఓటమి తప్పించుకోగలదు. లేకుంటే మరో ఘోర పరాజయం తప్పదు.