టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్కు ఘోర అవమానం ఎదురైంది. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లోనూ సిరాజ్ను అభిమానులు గేలి చేస్తున్నారు. శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
అయితే ఈ మ్యాచ్కు హాజరైన ఆసీస్ అభిమానులు.. సిరాజ్ను టార్గెట్ చేశారు. బౌండరీ లైన్ వద్ద సిరాజ్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. అతన్ని తక్కువ చేసేలా కామెంట్స్ చేశారు. అభిమానుల కామెంట్స్ను పట్టించుకోకుండా సిరాజ్ తన బౌలింగ్పై ఫోకస్ పెట్టాడు.

అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్లో ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్, సిరాజ్ల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ సెంచరీ సాధించగా.. అతన్ని సిరాజ్ ఔట్ చేశాడు. సెంచరీ బ్యాటర్ను ఔట్ చేశాననే ఆనందంలో సిరాజ్ గట్టిగా సంబరాలు చేసుకోగా.. ట్రావిస్ హెడ్ నోటికి పనిచెప్పాడు. సిరాజ్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతూ బయటకు వెళ్లాలని సైగలు చేశాడు.
సిరాజ్ బౌలింగ్ను మెచ్చుకుంటే అనుచితంగా ప్రవర్తించాడని మ్యాచ్ అనంతరం ట్రావిస్ హెడ్ మీడియాకు తెలిపాడు. అయితే ఈ వ్యాఖ్యలను సిరాజ్ ఖండించాడు. ట్రావిస్ హెడ్ అబద్దాలు చెప్పాడని, తనను ఎక్కడా మెచ్చుకోలేదన్నాడు. దాంతో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.
ఆ మ్యాచ్ సందర్భంగా ఆసీస్ అభిమానులు సిరాజ్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అతన్ని పదే పదే గేలి చేశారు. అయితే మ్యాచ్ అనంతరం ఈ ఘటనను మరిచి సిరాజ్, ట్రావిస్ హెడ్ మాట్లాడుకున్నారు. దాంతో ఈ గొడవకు తెరపడిందని అంతా అనుకున్నారు. కానీ అభిమానులు మాత్రం సిరాజ్ను విడిచిపెట్టడం లేదు.
ఇక మూడో టెస్ట్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. గబ్బా మైదానంలో భారీ వర్షం కురుస్తుండటంతో ఆట నిలిచిపోయింది. ఇప్పటికే రెండు సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోయింది. వర్షంతో ఆట ఆగిపోయే సమయానికి ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(19 బ్యాటింగ్), నాథన్ మెక్స్వీనీ(4 బ్యాటింగ్) ఆచితూచి ఆడారు. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్ బంతులను చాకచక్యంగా ఎదుర్కొన్నారు.
ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. హర్షిత్ రాణా, రవిచంద్రన్ అశ్విన్ స్థానాల్లో రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్ బరిలోకి దిగారు.