ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్కు వర్షం అంతరాయం కలిగించింది. బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియం వేదికగా శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్ తొలి రోజు ఆటను అంపైర్లు రద్దు చేశారు. ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(19 బ్యాటింగ్), నాథన్ మెక్స్వీనీ(4 బ్యాటింగ్) ఆచితూచి ఆడారు. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్ బంతులను చాకచక్యంగా ఎదుర్కొన్నారు. రెండో రోజు ఆట భారత కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం 5.20 గంటలకు ప్రారంభం కానుంది. ఆట సజావుగా సాగితే 98 ఓవర్లు ఆడించనున్నారు.

అయితే రెండో రోజు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. దాంతో అభిమానులను ఆందోళనకు గురవుతున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. 5.3 ఓవర్ల పాటు ఆట జరగ్గానే వర్షం రావడంతో అంపైర్లు, ఆటగాళ్లు స్టేడియం నుంచి బయటకు పరుగెత్తారు. వర్షం తగ్గడంతో తిరిగి ఆట ప్రారంభమైంది. కానీ మరో 7.5 ఓవర్ల పాటు ఆట జరగ్గా వర్షం మరోసారి అంతరాయం కలిగించడంతో అంపైర్లు ముందుగానే లంచ్ బ్రేక్ ప్రకటించారు.
ఆ తర్వాత వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఓవర్కాస్ట్ కండీషన్స్ నేపథ్యంలోనే బౌలింగ్ ఎంచుకున్నానని టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. కొంచెం ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉండటంతో పాటు పిచ్పై గ్రాస్ కూడా ఉంది. ఈ కండిషన్స్ను ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. ఇప్పటికే మేం చాలా క్రికెట్ ఆడాం. గత రెండు మ్యాచ్ల్లో ఇరు జట్లు మెరుగైన ప్రదర్శన చేశాయి. ఈ మ్యాచ్ మాకు చాలా కీలకం.
మాపై ఉన్న అంచనాలను అందుకోవాలనుకుంటున్నాం. మంచి క్రికెట్ ఆడుతాం. విజయవకాశాలను అందిపుచ్చుకోవాలి. గత మ్యాచ్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం. అందుకే ఓటమిపాలయ్యాం. ఈ మ్యాచ్ కోసం కుర్రాళ్లంతా సిద్దంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఆడుదామా? అనే ఉత్సాహంతో ఉన్నారు.
మ్యాచ్ సాగుతున్నా కొద్దీ ఈ వికెట్ బ్యాటింగ్కు అనుకూలిస్తోంది. తుది జట్టులో మేం రెండు మార్పులు చేశాం. అశ్విన్, హర్షిత్ రాణా స్థానాల్లో రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్ జట్టులోకి వచ్చారు. టీమ్ కాంబినేషన్లో భాగంగానే ఈ మార్పులు చేశాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.