రాజ్కోట్: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ను చివరి మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. రాజ్కోట్ వేదికగా బుధవారం జరగనున్న ఆఖరి పోరులో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి రెండు వన్డేల మాదిరి ఈ మ్యాచ్లోనూ విజయం సాధించి సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.
తద్వారా వన్డే ప్రపంచకప్ ముందు టీమ్ ఆత్మ విశ్వాసాన్ని రెండింతలు చేయాలనుకుంటోంది. మరోవైపు ఈ ఒక్క మ్యాచ్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ఆసీస్ భావిస్తోంది. ఈ విజయంతో తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేయాలనే పట్టుదలతో ఆసీస్ ఉంది. తొలి రెండు వన్డేలకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలు ఈ మ్యాచ్కు అందుబాటులోకి వచ్చారు.

మరోవైపు ఆసీస్ సైతం తమ ప్రధాన ఆటగాళ్లతో బరిలోకి దిగనుంది. అయితే మూడో వన్డేకు యువ ఓపెనర్ శుభ్మన్ గిల్తో పాటు మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలు దూరంగా ఉండనున్నారు.
వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా శుభ్మన్ గిల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీలకు రెస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆసియా కప్లో గాయపడిన అక్షర్ పటేల్ పూర్తిగా కోలుకోలేదు. తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా వ్యక్తిగత కారణాలతో మూడో వన్డేకు దూరంగా ఉండనున్నాడు. దాంతో సూర్యకుమార్ యాదవ్కు మార్గం సుగుమమైంది.
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ బరిలోకి దిగనుండగా.. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మిడిలార్డర్లో ఆడనున్నారు. ఆరో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగనుండగా.. స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఆడనున్నారు. పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణలు బరిలోకి దిగనున్నారు.
భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్/ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్