రాజ్కోట్: వన్డే ప్రపంచకప్ ముందు ఉత్సాహం ఉరకలేస్తుంటే, తొలి రెండు వన్డేల్లో విజయం విశ్వాసాన్ని పెంచుతుంటే..ఆఖరి సమరానికి టీమిండియా సిద్ధమైంది. క్లీన్స్వీప్ ఊరిస్తుండగా, ప్రపంచకప్ సన్నాహాలకు అదిరే ముగింపు ఇవ్వాలనుకుంటున్న రోహిత్ సేన.. మూడో వన్డేలో బుధవారం ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది.
వన్డేల్లో ఎప్పుడూ ఆస్ట్రేలియాను వైట్వాష్ చేయని భారత్.. ఈసారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. తొలి రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్తో తిరిగి జట్టులోకి రానున్నారు. అయితే జట్టును వైరల్ ఫీవర్ వెంటాడుతోంది. వివిధ కారణాల వల్ల మూడో వన్డేకు భారత్కు కేవలం 13 మంది ఆటగాళ్లు మాత్రమే సెలక్షన్కు అందుబాటులో ఉన్నారు.

సూపర్ ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్కు విశ్రాంతినివ్వగా.. పేసర్లు మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని హార్దిక్ పాండ్యా వ్యక్తిగత కారణాలతో ఇంటికి వెళ్లిపోయారు. 'జ్వరం కారణంగా చాలా మంది ఆటగాళ్లు అందుబాటులో లేకుండా పోయారు. కొందరు వ్యక్తిగత కారణాల వల్ల ఇంటికి వెళ్లిపోయారు.
కొందరికి విశ్రాంతినిచ్చాం. ప్రస్తుతం మాకు 13 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు'అని మీడియా సమావేవంలో కెప్టెన్ రోహిత్ తెలిపాడు. కొంతమంది ఆటగాళ్లు లేకపోయినా రోహిత్, కోహ్లీ రాకతో టీమిండియా బలంగానే ఉంది. కుల్దీప్ రీఎంట్రీతో స్పిన్ విభాగం కూడా బలపడనుంది.
తొలి రెండు వన్డేల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత్.. ఆటగాళ్ల ఫిట్నెస్, ఫామ్తో పాటు కూర్పుపై ప్రశ్నలకు జవాబులు దొరికిన నేపథ్యంలో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా శ్రేయస్, సూర్య జోరందుకోవడం జట్టుకు సంతోషాన్నిస్తోంది. మూడో వన్డేలో రోహిత్తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్ ఆరంభించవచ్చు. షమీ, ప్రసిద్ధ్ కృష్ణల స్థానాల్లో బుమ్రా, సిరాజ్ జట్టులోకి వస్తారు. మ్యాచ్లో టీమిండియాను నిలువరించడం ఆసీస్కు సవాలే.
రాజ్కోట్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. ఇక్కడ జరిగిన గత మ్యాచ్లో భారత్ 340 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లోనూ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్కు వర్ష ముప్పు అయితే లేదు. అయితే మ్యాచ్ సమయానికి మైదానాన్ని పాక్షికంగా మబ్బులు కమ్మే అవకాశం అయితే ఉంది.