ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్లో టీమిండియా ఓటమి అంచున నిలిచింది. అద్భుతమైన బ్యాటింగ్, అసాధారణ బౌలింగ్తో ఈ మ్యాచ్పై ఆసీస్ పట్టు బిగించింది. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(6), మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(11) దారుణంగా విఫలమయ్యారు.
దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 24 ఓవర్లలో 5 వికెట్లకు 128 పరుగులు చేసింది. క్రీజులో రిషభ్ పంత్(28 బ్యాటింగ్), నితీష్ కుమార్ రెడ్డి(15 బ్యాటింగ్) ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్, ప్యాట్ కమిన్స్ రెండేసి వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ ఓ వికెట్ పడగొట్టాడు.

ట్రావిస్ హెడ్ విధ్వంసం..
అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 87.3 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆ జట్టుకు 157 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(141 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్లతో 140) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. మార్నస్ లబుషేన్(126 బంతుల్లో 9 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీతో రాణించాడు.
భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(4/98), జస్ప్రీత్ బుమ్రా(4/61) నాలుగేసి వికెట్లు తీయగా.. నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు. భారత్ ఇంకా 29 పరుగుల వెనుకంజలో ఉంది. ఇక రెండో రోజు ఆటలో టీమిండియా పూర్తిగా తేలిపోయింది. మూడు సెషన్లలో ఆసీస్ ఆధిపత్యమే నడిచింది. మూడో రోజు ఆటలో పంత్, నితీష్ కుమార్ రెడ్డి అద్భుతం చేస్తే తప్పా ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కదు.
బుమ్రా చెలరేగినా..
86/1 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్కు శుభారంభం దక్కలేదు. టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా అద్భుత బౌలింగ్తో..
ఓవర్నైట్ బ్యాటర్ నాథన్ మెక్స్వీనీ(39)తో పాటు స్టీవ్ స్మిత్(2)ను పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో లబుషేన్, ట్రావిస్ హెడ్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 55 పరుగుల భాగస్వామ్యంతో పాతుకుపోయిన ఈ జోడీని నితీష్ కుమార్ రెడ్డి విడదీసాడు.
లబుషేన్ను జైస్వాల్ సాయంతో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి మిచెల్ మార్ష్ రాగా.. ట్రావిస్ హెడ్ 63 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో ఆసీస్ 200/4 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
ట్రావిస్ హెడ్ విధ్వంసం..
రెండో సెషన్ ఆరంభంలోనే మిచెల్ మార్ష్(9)ను అశ్విన్.. ఔట్ చేయగా.. మరోవైపు ట్రావిస్ హెడ్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వన్డే తరహా బ్యాటింగ్తో బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలో అతను 111 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో అలెక్స్ క్యారీ(15)ని సిరాజ్ ఔట్ చేయడంతో 6వ వికెట్కు నమోదైన 74 పరుగుల భాసగ్వామ్యానికి తెరపడింది.
సెంచరీ అనంతరం ట్రావిస్ హెడ్ మరింత దూకుడుగా ఆడాడు. కానీ అతన్ని సిరాజ్ స్టన్నింగ్ యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్యాట్ కమిన్స్(12)ను బుమ్రా ఔట్ చేయడంతో ఆసీస్ 332/8 టీ బ్రేక్కు వెళ్లింది. మూడో సెషన్ తొలి బంతికే మిచెల్ స్టార్క్ను క్యాచ్ ఔట్ చేసిన సిరాజ్.. తన మరుసటి ఓవర్లో స్కాట్ బోలాండ్(0)ను క్లీన్ బౌల్డ్ చేసి ఆసీస్ ఇన్నింగ్స్కు తెరదించాడు.
కొంపముంచిన కోహ్లీ, రోహిత్..
157 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆసీస్ వ్యూహాలను పసిగట్టలేక వికెట్లను పారేసుకుంది. కేఎల్ రాహుల్(7)తో మొదలైన భారత వికెట్ల పతనం.. రోహిత్ శర్మ(6)వరకు కొనసాగింది. ఆచితూచి ఆడిన యశస్వి జైస్వాల్(24), శుభ్మన్ గిల్లు కూడా పెవిలియన్ చేరారు.
భారీ అంచనాలతో బ్యాటింగ్కు వచ్చిన కోహ్లీ.. మరోసారి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బలహీనతతో మూల్యం చెల్లించుకున్నాడు. రోహిత్ శర్మ అయితే తీవ్రంగా తడబడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో పంత్, నితీష్ కుమార్ రెడ్డి దూకుడుగా ఆడటంతో భారత్ మరో వికెట్ కోల్పోలేదు. కోహ్లీ, రోహిత్ మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే ఈ మ్యాచ్లో భారత్ పై చేయి సాధించేదని క్రికెట్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు.