ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆటలో టీమిండియా తేలిపోయింది. డే/నైట్ జరుగుతున్న ఈ పింక్ బాల్ టెస్ట్లో భారత బ్యాటర్లు, బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. దాంతో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 33 ఓవర్లలో వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది.
ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(13) విఫలమైనా.. నాథన్ మెక్స్వీనీ(97 బంతుల్లో 6 ఫోర్లతో 38 బ్యాటింగ్), మార్నస్ లబుషేన్(67 బంతుల్లో 3 ఫోర్లతో 20 బ్యాటింగ్) జిడ్డు బ్యాటింగ్తో క్రీజులో నిలబడ్డారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకే ఒక వికెట్ దక్కింది. ప్రస్తుతం ఆసీస్ ఇంకా 94 పరుగుల వెనుకంజలో ఉంది.

భారత్ 180 ఆలౌట్..
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 44.1 ఓవర్లలో 180 పరుగులకు కుప్పకూలింది. తెలుగు తేజం, యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి(54 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 42) దూకుడుగా ఆడగా.. కేఎల్ రాహుల్(64 బంతుల్లో 6 ఫోర్లతో 37), శుభ్మన్ గిల్(51 బంతుల్లో 5 ఫోర్లతో 31) పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(6/48) ఆరు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
టీమిండియా గోల్డెన్ డక్..
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కే యశస్వి జైస్వాల్ ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో భారత్ పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన శుభ్మన్ గిల్తో కలిసి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడాడు. మంచి బంతులను గౌరవించిన ఈ జోడీ చెడ్డవాటిని బౌండరీలకు తరలించింది. 69 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని మిచెల్ స్టార్క్ విడదీసాడు.
హాఫ్ సెంచరీకి చేరువైన రాహుల్(37)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన కోహ్లీ(7) కూడా స్టార్క్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ మరుసటి ఓవర్లోనే నిలకడగా ఆడుతున్న శుభ్మన్ గిల్(31)ను స్కాట్ బోలాండ్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో భారత్ 82/4 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
ఆదుకున్న నితీష్ రెడ్డి..
రెండో సెషన్ ఆరంభంలోనే రోహిత్ శర్మ(3)ను స్కాట్ బోలాండ్.. ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. నిలకడగా ఆడుతున్న రిషభ్ పంత్ను కమిన్స్ క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో భారత్ 109 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్ దూకుడుగా ఆడారు. ముఖ్యంగా అశ్విన్.. 100 స్ట్రైక్రేట్తో పరుగులు చేశాడు. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని స్టార్క్ విడదీసాడు.
అశ్విన్(22)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. అదే ఓవర్లో క్రీజులోకి వచ్చిన హర్షిత్ రాణా(0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రాతో కలిసి నితీష్ కుమార్ రెడ్డి దూకుడుగా ఆడాడు. ట్రేడ్ మార్క్ షాట్స్తో అలరించాడు. స్విచ్ హిట్, రివర్స్ స్వీప్, కవర్ డ్రైవ్లతో బౌండరీలు రాబట్టాడు. బుమ్రాను కమిన్స్ ఔట్ చేయగా.. దూకుడుగా ఆడే క్రమంలో స్టార్క్ బౌలింగ్లో నితీష్ క్యాచ్ ఔటయ్యాడు. దాంతో భారత తొలి ఇన్నింగ్స్కు తెరపడింది. అంపైర్లు టీ బ్రేక్ ప్రకటించారు.
ఆసీస్ ఆచితూచి..
చివరి సెషన్లో బ్యాటింగ్కు దిగిన ఆసీస్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. జస్ప్రీత్ బుమ్రా స్టన్నింగ్ డెలివరీకి ఉష్మాన్ ఖవాజా క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. స్లిప్లో రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్. నాథన్ మెక్స్వీనీ అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్తో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. కట్టుదిట్టమైన బంతులతో భారత బౌలర్లు ఇబ్బంది పెట్టినా.. క్రీజులో నిలబడ్డారు. జిడ్డు బ్యాటింగ్తో మరో వికెట్ పడకుండా ఆసీస్ ఇన్నింగ్స్కు అడ్డుగోడలా నిలిచారు.