ఐదు టీ20ల సిరీస్లో భాగంగా టీమిండియాతో మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. వికెట్ చూడటానికి బాగా కనిపిస్తోంది. ఇది 40 ఓవర్ల పాటు మారకుండా ఉంటుందని ఆశిస్తున్నాం. తుది జట్టులో ఒక మార్పు చేశాం. ఫిలిప్ స్థానంలో షార్ట్ జట్టులోకి వచ్చాడు.'అని మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు టాస్ గెలిచినా తాము ముందుగా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేయడానికి సంతోషిస్తున్నాం. దూకుడుగా ఆడటమే మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్. పరుగులు ఎలా చేయాలో శుభ్మన్ గిల్కు తెలుసు. అతనితో కలిసి బ్యాటింగ్ చేయాలంటే వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తాలి. మేం తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. సేమ్ కాంబినేషన్తో బరిలోకి దిగుతున్నాం.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
దాంతో అర్ష్దీప్ సింగ్కు మరోసారి నిరాశే ఎదురైంది. అతనికి బదులుగా హర్షిత్ రాణాను తుది జట్టులో ఆడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. తొలి టీ20 వర్షార్పణమైన విషయం విదితమే. అయితే ఈ మ్యాచ్లోనూ టీమిండియా టాస్ ఓడిపోవడంపై సూర్య ఫన్నీ రియాక్షన్ ఇచ్చాడు. టాస్ గెలవాలంటే పూజ చేయాలేమోనని సైగలు చేశాడు.

ఈ మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు బ్లాక్ రిస్ట్ బ్యాండ్స్తో బరిలోకి దిగారు. 17 ఏళ్ల ఆసీస్ యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్ అకాల మృతికి సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్ ధరించారు. ప్రాక్టీస్ నెట్ సెషన్లో బంతి మెడ భాగంలో బలంగా తగలడంతో ఆస్టిన్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణ ఉదంతాన్ని గుర్తు చేసిన ఈ ఘటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్వుడ్.