కొత్త ఏడాదిలో టీమిండియా జోరు కొనసాగుతోంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకొని సిరీస్ కైవసం చేసుకుంది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా అఫ్గానిస్థాన్తో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. శివమ్ దూబే(32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 63 నాటౌట్), యశస్వి జైస్వాల్(35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 68) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. ఇబ్రహీమ్ జడ్రాన్(35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 57) హాఫ్ సెంచరీతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(3/32) తీన్మార్ బౌలింగ్తో రఫ్ఫాడించగా.. రవి బిష్ణోయ్(2/39), అక్షర్ పటేల్(2/17) రెండేసి వికెట్లతో అఫ్గానిస్థాన్ పతనాన్ని శాసించారు. శివమ్ దూబేకు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమిండియా దూబే, యశస్వి సిక్సర్ల మోతకు ఓవర్లలో 4 వికెట్లకు పరుగులు చేసి అలవోక విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ(16 బంతుల్లో 5 ఫోర్లతో 29), రింకూ సింగ్(9 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్ను టీమిండియా 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
రోహిత్ గోల్డెన్ డక్..:
లక్ష్యచేధనకు దిగిన టీమిండియాకు తొలి ఓవర్లోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి డకౌట్గా వెనుదిరిగాడు. ఫజలక్ ఫరుఖీ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ధాటిగా ఆడాడు. ఈ ఇద్దరూ పోటాపడి బౌండరీలు బాదడంతో టీమిండియా ఐదు ఓవర్లలోనే 60 పరుగులు చేసింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని నవీన్ ఉల్ హక్ విడదీసాడు. విరాట్ కోహ్లీ(16 బంతుల్లో 5 ఫోర్లతో 29)ని క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 57 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
శివాలెత్తిన దూబే..:
క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ సిక్సర్ల మోత మోగించారు. మహమ్మద్ నబీ వేసిన 10వ ఓవర్ తొలి బంతికి క్విక్ సింగిల్ తీసి 27 బంతుల్లో యశస్వి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్లో శివమ్ దూబే హ్యాట్రిక్ సిక్స్లు బాదాడు. అనంతరం ఈ ఇద్దరూ సిక్సర్ల విషయంలో పోటీ పడ్డారు. నవీన్ ఉల్ హక్ వేసిన 12వ ఓవర్లో దూబే మూడు బౌండరీలు బాది 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ధాటిగా ఆడుతున్న ఈ జోడీ కరీమ్ జనత్ విడదీసాడు. యశస్వి జైస్వాల్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 92 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన జితేశ్ శర్మ(0) డకౌట్గా వెనుదిరిగాడు. రింకూ సింగ్ సాయంతో శివమ్ దూబే భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.