సౌతాఫ్రికా పర్యటన అనంతరం టీమిండియా మరో ఆసక్తికర సమరానికి సిద్దమైంది. సొంతగడ్డపై అఫ్గానిస్థాన్తో జరగనున్న మూడు టీ20ల సిరీస్లో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. మొహాలీ వేదికగా గురువారం జరిగే తొలి మ్యాచ్తో ఈ సిరీస్కు తెరలేవనుంది. ఈ ఏడాది జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024 ముందు టీమిండియా ఆడనున్న ఏకైక టీ20 సిరీస్ ఇదే కావడంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
అంతేకాకుండా వన్డే ప్రపంచకప్ నేపథ్యంలోనే 14 నెలలుగా పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ సిరీస్తోనే టీ20 ఫార్మాట్లో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అజిత్ అగార్కర్ సారథ్యంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. సీనియర్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వగా.. గాయాల బారిన పడిన సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, మహమ్మద్ షమీలు ఈ సిరీస్కు కూడా దూరమయ్యారు.

సుదీర్ఘ విరామం తర్వాత టీ20ల్లో రీఎంట్రీ ఇస్తున్నాడని సంతోషించిన విరాట్ కోహ్లీ అభిమానులకు నిరాశే ఎదురైంది. అఫ్గానిస్థాన్తో జరిగే తొలి టీ20కి విరాట్ కోహ్లీ అందుబాటులో లేడని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. వ్యక్తిగత కారణాలతో అతను ఈ మ్యాచ్ ఆడటం లేదని చెప్పాడు. అయితే ఆ కారణాలు ఏంటో మాత్రం వెల్లడించలేదు.
బెంగళూరు వేదికగా జరిగే రెండో టీ20కి ముందు జట్టుతో విరాట్ కోహ్లీ కలుస్తాడని స్పష్టం చేశాడు. అయితే విరాట్ కోహ్లీ తొలి టీ20 ఎందుకు ఆడటం లేదా? అని అభిమానులు తెగ సెర్చ్ చేశారు. ఈ క్రమంలో వారికి షాకింగ్ విషయం తెలిసిందే. గురువారం(జనవరి 11న) విరాట్ కోహ్లీ ముద్దుల తనయ వామికా పుట్టిన రోజు. ఆమె జన్మదినం కోసం కోహ్లీ తన కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్కు వెళ్లాడు.
కూతురి బర్త్ డే కోసమే కోహ్లీ అఫ్గానిస్థాన్తో తొలి టీ20కి అందుబాటులో లేకుండా పోయాడని అర్థమవుతోంది. తొలి టీ20కి విరాట్ కోహ్లీ దూరమవ్వడంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు విమర్శలు గుప్పిస్తుంటే మరికొందరు మాత్రం అతనికి మద్దతుగా నిలుస్తున్నారు.