టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీ అసాధారణ ఫీల్డింగ్లో కుర్రాళ్లు సగం చేసినా.. టీమిండియాకు తిరుగుండదని చెప్పాడు. అఫ్గానిస్థాన్తో బుధవారం జరిగిన మూడో టీ20లో బ్యాటింగ్లో విఫలమైన కోహ్లీ.. ఫీల్డింగ్లో సత్తా చాటాడు.
మైదానంలో చిరుతలా కదిలిన కోహ్లీ.. సూపర్ మ్యాన్ స్టంట్తో సిక్సర్ను సింగిల్గా మార్చాడు. బౌండరీ లైన వద్ద సెన్సేషనల్ రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. మెరుపు ఫీల్డింగ్తో 20 పరుగుల వరకు సేవ్ చేశాడు. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.

అసాధారణ ఫీల్డింగ్తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. డబుల్ సూపర్ ఓవర్కు దారి తీసిన ఈ మ్యాచ్లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ఈ విజయానంతరం టీమిండియా డ్రెస్పింగ్ రూమ్లో విరాట్ కోహ్లీని బెస్ట్ ఫీల్డర్ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా ఫీల్డింగ్ కోచ్ దిలీప్.. కుర్రాళ్లంతా విరాట్ కోహ్లీని అనుసరించాలని సూచించాడు.
'వన్డే ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ రెండు సార్లు బెస్ట్ ఫీల్డర్ అవార్డు అందుకున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో నాతో కోహ్లీ అన్న మాటలు ఇంకా గుర్తున్నాయి. తనకు స్లిప్లో ఫీల్డింగ్ చేయాలని లేదని, షార్ట్, ఫైన్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తానని చెప్పాడు. ప్రపంచకప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని, తద్వారా యువకులకు సవాల్ విసరాలని భావించాడు.
అనుకున్నట్లుగానే సత్తా చాటాడు. తన దూకుడును జట్టుకు కూడా అందించాడు. తన పనిని తాను చేసుకోవడమే కాకుండా ఇతరులు స్పూర్తి పొందేలా ఆడాడు. అతనితో కలిసి ఆడటం కుర్రాళ్లకు దక్కిన గొప్ప అవకాశం. జట్టులోని కుర్రాళ్లంతా అతన్ని అనుసరించే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నా. కోహ్లీ ప్రదర్శనలో సగం చేసినా టీమిండియాకు తిరుగుండదు.'అని దిలీప్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ(69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 నాటౌట్) రికార్డ్ సెంచరీతో చెలరేగగా.. రింకూ సింగ్(39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్కు అజేయంగా 190 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్కు దారి తీసింది. అఫ్గాన్ టాప్-3 బ్యాటర్లు రెహ్మనుల్లా గుల్బాదిన్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 50), ఇబ్రహీమ్ జడ్రాన్(41 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 50), గుల్బాదిన్ నైబ్(23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
తొలి సూపర్ ఓవర్లో అఫ్గాన్ 16 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ అటాకింగ్ బ్యాటింగ్తో భారత్ కూడా 16 పరుగులే చేసింది. దాంతో రెండో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. సెకండ్ సూపర్ ఓవర్లో టీమిండియా 11 పరుగులు చేయగా.. అఫ్గాన్ మూడు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. దాంతో భారత విజయం ఖాయమైంది.