టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా అఫ్గానిస్థాన్తో సూపర్-8 మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 53) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది.
హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 32) రాణించగా.. రోహిత్ శర్మ(8), రిషభ్ పంత్(24), విరాట్ కోహ్లీ(20) తీవ్రంగా నిరాశపరిచారు. అఫ్గాన్ బౌలర్లలో ఫజలక్ ఫరూఖీ(3/33), రషీద్ ఖాన్(3/26) మూడేసి వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు. నవీన్ ఉల్ హక్కు ఓ వికెట్ దక్కింది.

నిరాశపర్చిన రోహిత్..
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ(8) తీవ్రంగా నిరాశ పరిచాడు. లెఫ్టార్మ్ పేసర్లను ఎదుర్కొనే విషయంలో రోహిత్ శర్మ తన బలహీనతను బయట పెట్టుకున్నాడు.
ఫజలక్ ఫరూఖీ వేసిన మూడో ఓవర్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్తో కలిసి మరో ఓపెనర్ కోహ్లీ ఆచితూచి ఆడాడు. పంత్ తన దైన శైలిలో చెలరేగడంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది.

దెబ్బతీసిన రషీద్ ఖాన్..
పవర్ ప్లే అనంతరం బంతిని అందుకున్న రషీద్ ఖాన్ వరుస ఓవర్లలో నిలకడగా ఆడుతున్న రిషభ్ పంత్, విరాట్ కోహ్లీలను పెవిలియన్ చేర్చాడు. రిషభ్ పంత్ను వికెట్ల ముందు బోల్తా కొట్టించిన రషీద్ ఖాన్.. విరాట్ కోహ్లీని ఊరించే బంతితో బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఔట్ చేశాడు.
క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే ఓ భారీ సిక్సర్తో దూకుడు కనబర్చినా.. ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. రషీద్ ఖాన్ ధాటికి ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా 90 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

ఆదుకున్న సూరీడు..
ఈ పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యాతో కలిసి సూర్యకుమార్ యాదవ్ జట్టును ఆదుకున్నాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ వేగంగా పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా సైతం భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఫజలక్ ఫరూఖీ వేసిన 17వ ఓవర్లో వరుసగా 6, 4 బాదిన సూర్య 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అదే జోరులో మరో భారీ షాట్కు ప్రయత్నించిన సూర్య... క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో ఐదో వికెట్కు నమోదైన 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి రవీంద్ర జడేజా రాగా.. హార్దిక్ పాండ్యా భారీ సిక్స్ బాదాడు. కానీ ఆ వెంటనే క్యాచ్ ఔటయ్యాడు. ఆ వెంటనే రవీంద్ర జడేజా ఓ చెత్త షాట్తో క్యాచ్ ఔట్గా వెనుదిరగ్గా.. ఆఖరి ఓవర్లో అక్షర్ పటేల్ రెండు బౌండరీ బాది జట్టు స్కోర్ను 180 పరుగుల మార్క్ను ధాటించాడు.