టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు అందుకున్న రెండో ప్లేయర్గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్ను సూరీడు సమం చేశాడు.
టీ20 ప్రపంచకప్ 2024లో అఫ్గానిస్థాన్తో గురువారం జరిగిన గ్రూప్-1 సూపర్-8 మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో భారత్ 43 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ టోర్నీలో ఓ టీమిండియా బ్యాటర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోవడం ఇదే తొలిసారి. గ్రూప్ దశలో జరిగిన మూడు మ్యాచ్ల్లో బౌలర్లే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నారు. టీ20 కెరీర్లో ఇది సూర్యకు 15వ అవార్డ్. 64 టీ20 మ్యాచ్ల్లో సూర్య ఈ ఫీట్ సాధించడం విశేషం. విరాట్ కోహ్లీ మాత్రం 121 మ్యాచ్ల్లో 15 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లు అందుకున్నాడు.
ఈ జాబితాలో సూర్య, కోహ్లీ తర్వాత విరందీప్ సింగ్(78 మ్యాచ్లు), సికిందర్ రాజా(86 మ్యాచ్లు), మహమ్మద్ నబీ(126 మ్యాచ్లు) 14 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ స్వీకరించారు.
గత రెండేళ్లుగా సూర్య వరల్డ్ నెంబర్ 1 టీ20 బ్యాటర్గా కొనసాగుతున్నాడు. 2021లో అంతర్జాతీయ టీ20 క్రికెట్లోకి అడుగుపెట్టిన సూర్య.. ఇప్పటి వరకు 64 టీ20 మ్యాచ్లు ఆడాడు. 45.06 సగటుతో 2253 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు ఉన్నాయి. రోహిత్ శర్మ, గ్లేన్ మ్యాక్స్వెల్ తర్వాత టీ20ల్లో అత్యధిక శతకాలు నమోదు చేసిన బ్యాటర్గా సూరీడు కొనసాగుతున్నాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 32) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫజలక్ ఫరూఖీ(3/33), రషీద్ ఖాన్(3/26) మూడేసి వికెట్లు తీయగా.. నవీన్ ఉల్ హక్కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. అజ్మతుల్లా ఒమర్జాయ్(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 26) టాప్ స్కోరర్గా నిలిచారు. జస్ప్రీత్ బుమ్రా(3/7), అర్ష్దీప్ సింగ్(3/36) అఫ్గాన్ పతనాన్ని శాసించారు.