అదృష్టం తలుపు తట్టే లోపు దురదృష్టం వెక్కిరించినట్లుంది టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ పరిస్థితి. ఎన్నో రోజులుగా టీమిండియాలో చోటు కోసం ఎదురు చూస్తున్న సంజూ శాంసన్.. రాక రాక వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఈ కారణంగానే అతను గత ఐదారేళ్లుగా భారత జట్టులోకి వస్తూ పోతున్నాడు.
అవకాశాలను అందిపుచ్చుకోలేక టీమిండియాలో చోటును సుస్థిరం చేసుకోలేకపోయాడు. తాజాగా భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్ మూడో టీ20లోనూ అతను దారుణంగా విఫలమయ్యాడు. ఇషాన్ కిషన్ స్థానంలో ఈ సిరీస్కు ఎంపికైన సంజూ శాంసన్ తొలి రెండు టీ20ల్లో చోటు దక్కించుకోలేకపోయాడు. అతనికి బదులు జితేశ్ శర్మకు అవకాశం దక్కగా.. అతను అద్భుత ప్రదర్శన కనబర్చాడు.

రెండో టీ20లో విఫలమైనా.. తొలి మ్యాచ్లో రాణించాడు. సిరీస్ కైవసం చేసుకోవడంతో చివరి మ్యాచ్లో సంజూ శాంసన్కు అవకాశం ఇవ్వగా అతను గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. తొలి బంతినే భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అప్పటికే మూడు వికెట్లు కోల్పోయి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న టీమిండియాను ఆదుకోవాల్సిన సంజూ శాంసన్ చెత్త షాట్తో పెవిలియన్ చేరాడు.
దాంతో సంజూ శాంసన్పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దరిద్రానికే బ్రాండ్ అంబాసిడర్ సంజూ శాంసన్ అని కామెంట్ చేస్తున్నారు. ఈ వైఫల్యంతో అతని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు ముగింపు పడినట్లేనని కామెంట్ చేస్తున్నారు. నిలకడగా బ్యాటింగ్ చేయకపోవడమే సంజూ శాంసన్ అసలు సమస్యని అభిప్రాయపడుతున్నారు.
మరికొందరు మాత్రం సంజూ శాంసన్ సాధారణ ఆటగాడే అయినా.. అతని పెయిడ్ పీఆర్ సోషల్ మీడియాలో సూపర్ స్టార్ను చేశాయని విమర్శిస్తున్నారు. కొందరైతే రాక రాక వచ్చిన అవకాశాన్ని చెత్త షాట్తో చేజార్చుకున్నాడని మండిపడుతున్నారు. అసలు ఆ షాట్ ఆడేందుకు సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఫరీద్ అహ్మద్ షాకిచ్చాడు. అతను వేసిన మూడో ఓవర్లో వరుస బంతుల్లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటయ్యారు. జైస్వాల్(4) భారీ షాట్ ఆడే క్రమంలో క్యాచ్ ఔటవ్వగా.. మరుసటి బంతికే కోహ్లీ క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు.
ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే(1)ను అజ్మతుల్లా ఒమర్జాయ్ ఔట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్లోనే సంజూ శాంసన్(0)ను ఫరీద్ అహ్మద్ గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో టీమిండియా 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్తో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ను ముందుకు నడపిస్తున్నాడు. ఈ ఇద్దరూ ఇప్పటికే 80 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు.