టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా అఫ్గానిస్థాన్తో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా కనిపిస్తోందని, మ్యాచ్ జరుగుతున్నా కొద్దీ నెమ్మదిగా మారే అవకాశం ఉందని చెప్పాడు.
'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడమే ఉత్తమం అనిపిస్తోంది. పిచ్ కూడా బాగుంది. వికెట్పై ఎలాంటి గడ్డి లేదు. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ పిచ్ నెమ్మదించే అవకాశం ఉంది. న్యూయార్క్ కంటే మెరుగైన పిచ్. వీలైనంత త్వరగా పిచ్ కండిషన్స్ను అందిపుచ్చుకోవడం చాలా కీలకం.

ఇక్కడికి మేం కొద్ది రోజుల ముందే వచ్చాం. మాకు ఇక్కడ ఆడిన అనుభవం కూడా ఉంది. సాధారణంగా సాయంత్రం వేళలో మ్యాచ్లు ఆడుతాం. కానీ ఇక్కడ ఉదయమే ఆడుతున్నాం. జట్టులో ఒక మార్పు చేశాం. మహమ్మద్ సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ వచ్చాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ తెలిపాడు. టీ20ల్లో ఎలా ఆడామన్నదే ముఖ్యమని రషీద్ చెప్పుకొచ్చాడు. 'మా ప్రిపరేషన్స్ పట్ల మేం సంతోషంగా ఉన్నాం. మేం మంచి జట్లను ఎదుర్కోవాల్సి ఉంది. మా భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని సహజమైన గేమ్ ఆడాల్సి ఉంది.
కండిషన్స్ను అర్థం చేసుకోవడం కూడా కీలకమే. మేం ఇప్పటి వరకు మంచి క్రికెట్ ఆడాం. మేం కూడా జట్టులో ఒక మార్పు చేశాం. కరీమ్ జనత్ స్థానంలో హజ్రతుల్లా జాజై వచ్చాడు.'అని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
భారత్: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా
అఫ్గానిస్థాన్: రెహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీమ్ జడ్రాన్, హజ్రతుల్లా జాజై, గుల్బాదిన్ నైబ్, నజిబుల్లా జడ్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫజలక్ ఫరూకీ