రనౌట్ అయిన ఫ్రస్టేషన్లోనే శుభ్మన్ గిల్పై నోరు పారేసుకున్నానని, ఆటలో ఇవన్నీ సహజమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా అఫ్గానిస్థాన్తో బుధవారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ తప్పిదం కారణంగా రోహిత్ శర్మ రనౌట్గా వెనుదిరిగాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన రోహిత్ శర్మ.. శుభ్మన్ గిల్పై నోరు పారేసుకున్నాడు.మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై స్పందించిన రోహిత్.. ఇవన్నీ ఆటలో సహజమని తెలిపాడు. ఈ మ్యాచ్ గెలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పిన అతను.. ఎన్నో సానుకూలంశాలు లభించాయన్నాడు.

'రనౌట్ అవ్వడం ఆటలో సహజం. రనౌటైనప్పుడు అసహనానికి గురవ్వడం కూడా సర్వ సాధారణం. ఆ ఫ్రస్టేషన్లో వచ్చిన మాటలు మాత్రమే. ఉద్దేశపూర్వకంగా అన్నవి కాదు. జట్టు కోసం బాగా ఆడాలనుకున్నప్పుడు ఇలా రనౌట్ అయితే ఎవరైన అసహనానికి గురవుతారు. ముఖ్యంగా పరిస్థితులన్నీ మనకు ప్రతీకూలంగా మారినప్పుడు ఇలా జరిగితే కోపం వస్తుంది.
ఈ మ్యాచ్లో మేం గెలవడం అన్నిటికంటే ముఖ్యం. నేను ఔటైన తర్వాత శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ను నడిపిస్తాడని భావించాను. దురదృష్టవశాత్తు అతను తన జోరును కొనసాగించలేకపోయాడు. ఇక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంది. క్యాచ్ పటినప్పుడు వేలికి గాయమైంది. ప్రస్తుతం బాగానే ఉంది. ఈ మ్యాచ్లో మాకు అనేక సానుకూలంశాలు లభించాయి.
ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ముఖ్యంగా బంతితో అద్భుతంగా రాణించాం. ప్రతికూల పరిస్థితుల్లోనూ మా స్పిన్నర్లు, పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. శివమ్ దూబే, జితేశ్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. వారి ఫామ్ను కొనసాగించారు. ఈ మ్యాచ్లో భిన్నమైన విషయాలను ప్రయత్నించాం.
విభిన్న పరిస్థితుల్లో మా బౌలర్లను ప్రయోగించాం. వాషింగ్టన్తో 19వ ఓవర్ వేయించాం. మాకు మేం సవాల్ చేసుకున్నాం. కొన్ని విషయాల్లో మేం అసౌకర్యంగా కనిపించాం. అయితే రానున్న మ్యాచ్ల్లో మా బలహీనతలన్నింటినీ అధిగమించే ప్రయత్నం చేస్తాం. ఫలితంలో తేడా రాకుండా ప్రయోగాలు చేస్తాం. సమష్టి ప్రదర్శనల కోసం కృషి చేస్తాం'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో మహమ్మద్ నబీ(27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 42), అజ్మతుల్లా ఒమర్జాయ్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 29), ఇబ్రహీమ్ జడ్రాన్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 25) రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్ రెండేసి వికెట్లు తీయగా.. శివమ్ దూబే ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసి గెలుపొందింది. శివమ్ దూబే(40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 60 నాటౌట్)కు తోడుగా జితేశ్ శర్మ(20 బంతుల్లో 5 ఫోర్లతో 31), తిలక్ వర్మ(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 26) రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ తీసారు.