టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్గా అరుదైన రికార్డు నమోదు చేశాడు. అఫ్గానిస్థాన్తో బుధవారం జరిగిన మూడో టీ20లో రోహిత్ శర్మ (69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 నాటౌట్) రికార్డ్ సెంచరీతో చెలరేగాడు. అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ శర్మకు ఇది ఐదో సెంచరీ.
పొట్టి ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ(5) తర్వాత సూర్యకుమార్ యాదవ్(4), గ్లేన్ మ్యాక్స్వెల్(4) ఉన్నారు. ఇక రోహిత్ శర్మ టీ20ల్లో ఐదేళ్ల తర్వాత శతకం సాధించాడు. చివరి సారిగా 2019 జూన్లో చేశాడు.

ఈ విధ్వంసకర శతకంతో రోహిత్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఓకే ఓవర్లో 36 పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రింకూ సింగ్తో కలిసి మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో 6 బంతుల్లో 6 సిక్స్లు బాదిన యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్.. తొలి రెండు స్థానాల్లో ఉండగా.. రోహిత్-రింకూ మూడో స్థానంలో నిలిచారు.
టీ20ల్లో భారత్ తరఫున ఏ వికెట్కైనా అత్యధిక పరుగుల భాగస్వామ్యం అందించిన రికార్డును రింకూ సింగ్తో పంచుకున్నాడు. ఈ మ్యాచ్లో రింకూ సింగ్తో కలిసి నాలుగో వికెట్కు అజేయంగా 190 పరుగులు జోడించాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కలిగిన రెండో బ్యాటర్గా కూడా రోహిత్ నిలిచాడు. శుభ్మన్ గిల్ మొదటి స్థానంలో ఉన్నాడు.
ఈ మ్యాచ్లో తొలి 34 బంతుల్లో 28 పరుగులే చేసిన రోహిత్.. చివరి 35 బంతుల్లో 93 పరుగులు బాదాడు. టీ20ల్లోఅత్యధిక పరుగులు, 50 ప్లస్ రన్స్ కలిగిన భారత కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డ్ సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్స్లు బాదిన ప్లేయర్గానూ చరిత్రకెక్కాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 నాటౌట్) రికార్డ్ సెంచరీతో చెలరేగగా.. రింకూ సింగ్(39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీ సత్తా చాటాడు.
22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను రోహిత్-రింకూ విధ్వంసకర బ్యాటింగ్తో ఆదుకున్నారు. ఐదో వికెట్కు అజేయంగా 190 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరూ చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించారు. అఫ్గాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ 3 వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ తీసాడు.