టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు జతగా యువ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ఓపెనర్గా బరిలోకి దిగుతాడని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. అఫ్గానిస్థాన్తో మూడు టీ20ల సిరీస్ నేపథ్యంలో మొహాలీ వేదికగా గురువారం తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ బుధవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా టీమిండియా ఓపెనింగ్ కాంబినేషన్పై ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్పై తమకు పూర్తిగా నమ్మకం ఉందని ద్రవిడ్ తెలిపాడు. రోహిత్ శర్మకు జతగా అతనే బరిలోకి దిగుతాడని, తద్వారా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ దొరుకుతుందని చెప్పాడు.

'రోహిత్ శర్మ.. యశస్వీ జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారు. ఇలాంటి అద్భుతమైన ఆటగాళ్లు అందుబాటులో ఉన్నప్పుడు జట్టుకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందరికీ అన్నిసార్లు అవకాశాలు రాకపోవచ్చు. ఏదేమైనా యశస్వి జైస్వాల్ ఓపెనర్గా విజయవంతమైన తీరు అమోఘం. అతని వల్ల టాపార్డర్లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వస్తోంది.'అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
ఇప్పటి వరకు భారత్ తరఫున 15 టీ20లు ఆడిన యశస్వి జైస్వాల్ 159 ప్లస్ స్ట్రైక్రేట్తో 430 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు, ఓ శతకం ఉంది. యశస్వి జైస్వాల్ ఓపెనర్గా బరిలోకి దిగుతుండటంతో శుభ్మన్ గిల్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కోహ్లీ స్థానంలో అవకాశం కల్పిస్తే ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేయనున్నాడు.
ఇక శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. ప్రస్తుత టీ20 జట్టులో శ్రేయస్ అయ్యర్కు చోటు లేదన్నాడు.
'శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయకపోవడం వెనుక ఎలాంటి క్రమశిక్షణా చర్యలు లేవు. అతనికి జట్టులో చోటు లేదు. ఇప్పటికే జట్టులో చాలా మంది బ్యాటర్లు ఉన్నారు. సౌతాఫ్రికా పర్యటనలో కూడా అతను టీ20లు ఆడలేదనే విషయాన్ని గుర్తించాలి. చాలా మంది బ్యాటర్లు ఉన్నప్పుడు అందరికీ అవకాశం ఇవ్వడం అంత సులువు కాదు.'అని ద్రవిడ్ తెలిపాడు.