IND vs AFG: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్కు మరోసారి మొండి చెయ్యే ఎదురైంది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా అఫ్గానిస్థాన్తో జరుగుతున్న తొలి టీ20లో అతను బెంచ్కే పరిమితమయ్యాడు. సంజూ శాంసన్కు బదులు జితేశ్ శర్మకు టీమ్మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది.
సౌతాఫ్రికా పర్యటనలో జితేశ్ శర్మ దారుణంగా విఫలమైనా అతనికే అండగా నిలిచింది. జితేశ్ శర్మ కంటే ఎంతో సీనియర్ అయినా.. సౌతాఫ్రికా పర్యటనలో శతకంతో రాణించినా.. ఐపీఎల్ ఆడిన అనుభవం ఎంతో ఉన్న సంజూ శాంసన్ను పరిగణలోకి తీసుకోలేదు. సంజూ శాంసన్కే కాకుండా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు టీమ్మేనేజ్మెంట్ మొండి చెయ్యే చూపించింది.

ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో రోహిత్ శర్మకు జతగా యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడని రాహుల్ ద్రవిడ్ చెప్పిన తర్వాత కూడా తుది జట్టులో అతనికి చోటు దక్కలేదు. ఇక భారత తుది జట్టును చూసి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాలో రాజకీయాలు నడుస్తున్నాయనేందుకు ఈ మ్యాచ్ తుది జట్టు ఎంపికనే నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు.
సోషల్ మీడియా వేదికగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ ను ఏకీపారేస్తున్నారు. యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్లను నమ్మించి గొంతు కోశారని, టీ20 ప్రపంచకప్ 2024 ప్రణాళికల్లో వీరికి చోటు లేదనే విషయం స్పష్టమైందని అభిప్రాయపడుతున్నారు.
సౌతాఫ్రికా పర్యటనలో శతకంతో రాణించిన సంజూ శాంసన్కు అవకాశం ఇవ్వకపోవడం దారుణమని, జితేశ్ శర్మలా అతనికి వరుసగా అవకాశాలు ఇచ్చి ఉంటే ఇప్పటికే జట్టులో సీనియర్ ఆటగాడిగా ఉండేవాడని అభిప్రాయపడుతున్నారు. రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, కేఎస్ భరత్, కేఎల్ రాహుల్లకు అవకాశాలు ఇచ్చిన బీసీసీఐ... సంజూ శాంసన్ పట్ల మాత్రం వివక్ష చూపుతుందని మండిపడుతున్నారు.
సంజూ శాంసన్ కంటే జితేశ్ శర్మ ఏ విషయంలో మెరుగైన క్రికెటరో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తిలక్ వర్మను ఆడించాలనే ఉద్దేశంతో రోహిత్ శర్మ రాజకీయం చేశాడని, ముంబై ఇండియన్స్ ప్లేయర్ కోసం సంజూకు అన్యాయం చేశాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే మిడిలార్డర్లో ఆడే బ్యాటర్లు ఉండటంతోనే లోయరార్డర్లో ఆడే జితేశ్ శర్మకు అవకాశం దక్కిందని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. కుల్దీప్ యాదవ్ను పక్కనపెట్టి రవి బిష్ణోయ్ను ఆడించడం మాత్రం షాకింగ్గా ఉందని కామెంట్ చేస్తున్నారు.