టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. గ్రూప్-1లో భాగంగా అఫ్గానిస్థాన్తో గురువారం జరిగిన సూపర్-8 మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా.. 47 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్లో సూరీడు చెలరేగితే.. బౌలింగ్లో బుమ్రా(3/7) నిప్పులు చెరిగాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 32) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫజలక్ ఫరూఖీ(3/33), రషీద్ ఖాన్(3/26) మూడేసి వికెట్లు తీయగా.. నవీన్ ఉల్ హక్కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. అజ్మతుల్లా ఒమర్జాయ్(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 26), నజిబుల్లా జడ్రాన్(19) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(3/7), అర్ష్దీప్ సింగ్(3/36) మూడేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.
నిప్పులు చెరిగిన బుమ్రా..
182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన రెండో ఓవర్లో అఫ్గాన్ ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్(11) కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఆ వెంటనే ఇబ్రహీమ్ జడ్రాన్(8)ను అక్షర్ పటేల్ ఔట్ చేయగా.. హజ్రతుల్లా జజై(2)ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. దాంతో అఫ్గాన్ 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఆచితూచి ఆడారు. దాంతో పవర్ ప్లేలో అఫ్గాన్ 3 వికెట్లకు 35 పరుగులు చేసింది. అనంతరం మరింత నిలకడగా బ్యాటింగ్ చేసిన ఈ జోడీ 44 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేసింది. కానీ కుల్దీప్ యాదవ్ గుల్బాదిన్ నైబ్ను కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చి దెబ్బతీసాడు.
అదరగొట్టిన అర్ష్దీప్ సింగ్..
ఆ వెంటనే అజ్మతుల్లా ఒమ్జాయ్(20)ను జడేజా ఔట్ చేయగా.. నజిబుల్లా జడ్రాన్(19)ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. ఓ సిక్సర్తో దూకుడు కనబర్చిన మహమ్మద్ నబీ(14)ని కుల్దీప్ యాదవ్ క్యాచ్ ఔట్ చేశాడు. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో రషీద్ ఖాన్(2), నవీన్ ఉల్ హక్(0) వరుస బంతుల్లో ఔటయ్యారు. ఆఖరి బంతికి నూర్ అహ్మద్(12) ఔటవ్వడంతో భారత్ విజయం లాంఛనమైంది.