IND vs AFG: మూడు టీ20ల సిరీస్లో భాగంగా అఫ్గానిస్థాన్తో జరుగుతున్న రెండో మ్యాచ్లో టీమిండియా బౌలర్లు దుమ్మురేపారు. అర్ష్దీప్ సింగ్(3/32) తీన్మార్ బౌలింగ్తో రఫ్ఫాడించగా.. రవి బిష్ణోయ్(2/39), అక్షర్ పటేల్(2/17) రెండేసి వికెట్లతో అఫ్గానిస్థాన్ పతనాన్ని శాసించారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది.
ఇబ్రహీమ్ జడ్రాన్(35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 57) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. లోయరార్డర్ బ్యాటర్లు విలువైన పరుగులు జోడించారు. భారత బౌలర్లలో శివమ్ దూబేకు కూడా ఓ వికెట్ దక్కింది.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్థాన్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓ బౌండరీ, సిక్సర్తో జోరు కనబర్చిన రెహ్మానుల్లా గుర్బాజ్(14)ను రవి బిష్ణోయ్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో క్రీజులోకి వచ్చిన గుల్బాదిన్ నైబ్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. సిక్సర్లతో పాటు బౌండరీలు మోత మోగించడంతో అఫ్గాన్ 5 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్ను ధాటింది.
అయితే మరో ఓపెనర్ ఇబ్రహీమ్ జడ్రాన్(8)ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో పవర్ ప్లేలో అఫ్గాన్ 2 వికెట్లకు 58 పరుగులు చేసింది. ఆ వెంటనే అజ్మతుల్లా ఒమర్జాయ్(2)ను శివమ్ దూబే క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చిన మహమ్మద్ నబీతో కలిసి గుల్బాదిన్ నైబ్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన అతన్ని అక్షర్ పటేల్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్ది సేపటికే మహమ్మద్ నబీ(14)ని రవి బిష్ణోయ్ ఔట్ చేయగా.. నజిబుల్ల జడ్రాన్(23) భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతన్ని అర్ష్ దీప్ సింగ్ క్లీన్ బౌల్డ్ చేయగా.. కరీమ్ జనత్(20) శివమ్ దూబే వేసిన 19వ ఓవర్లో సిక్స్, ఫోర్ బాది 20 పరుగులు పిండుకున్నాడు.