గజ్జలో గాయంతోనే టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అఫ్గానిస్థాన్తో తొలి టీ20 మ్యాచ్ ఆడటం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తెలిపింది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా అఫ్గాన్తో మొహాలీ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో యశస్వి జైస్వాల్కు చోటు దక్కలేదు. ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో రోహిత్ శర్మకు జతగా యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.
కానీ తుది జట్టులో అతని పేరు లేదు. దాంతో అభిమానులు అంతా అయోమయానికి గురయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం యశస్వి జైస్వాల్ గైర్హాజరీకి గల కారణాన్ని వెల్లడించలేదు. టీమ్కాంబినేషన్లో భాగంగానే యశస్వి, కుల్దీప్ యాదవ్, ఆవేశ్ ఖాన్, సంజూ శాంసన్ ఆడటం లేదని చెప్పారు. దాంతో యశస్వికి అన్యాయం జరిగిందని అభిమానులు భావించారు.

కానీ గజ్జలో గాయంతో అతను చివరి నిమిషంలో ఈ మ్యాచ్కు దూరమయ్యాడని బీసీసీఐ తెలిపింది. ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. 'కుడి గజ్జలో నొప్పితో తొలి టీ20కి యశస్వి జైస్వాల్ దూరమయ్యాడు.'అని బీసీసీఐ ట్వీట్ చేసింది. భారత్-అఫ్గానిస్థాన్ మధ్య ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్ కాగా.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. ఇందుకు కచ్చితమైన కారణం ఏం లేదు. పిచ్ బాగుంది. పెద్దగా మారే అవకాశం లేదు. టీ20 ప్రపంచకప్ 2024 ముందు మేం ఆడుతున్న ఏకైక టీ20 సిరీస్ ఇదే. మెగా టోర్నీ ముందు ఐపీఎల్ మాత్రమే ఆడనున్నాం. టీమ్ కాంబినేషన్ గురించి ఇప్పటికే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో చర్చించాను.
జట్టుకు కావాల్సిన కాంబినేషన్ను ఎంపిక చేసేందుకు ఈ సిరీస్ను ఉపయోగించుకుంటాం. అలాగే ఈ సిరీస్ గెలవడం కూడా మాకు ముఖ్యమే. టీమ్ కాంబినేషన్లో భాగంగానే సంజూ శాంసన్, ఆవేశ్ ఖాన్, యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్లకు అవకాశం ఇవ్వలేదు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేశ్ శర్మ(కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్
అఫ్గానిస్థాన్: రెహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీమ్ జడ్రాన్, రెహ్మత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజిబుల్లా జడ్రాన్, మహమ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, కరీమ్ జనత్, ఫజలక్ ఫరూఖీ, నవీన్ ఉల్ హక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.